బెంగాల్‌లో నిర్మమత ప్రభుత్వం నడుస్తోంది

` వరుస సంక్షోభాలతో రాష్ట్రం సతమతం
` బెంగాల్‌ ర్యాలీలో మమతపై విరుకుపడ్డ మోడీ
కోల్‌కతా(జనంసాక్షి): ప్రస్తుతం బెంగాల్‌ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఉద్దేశించి ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ముర్షిదాబాద్‌, మాల్డాలో చోటుచేసుకున్న ఘర్షణలు ఆమె ప్రభుత్వ క్రూరత్వం, ఉదాసీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇండియా… విక్షిత్‌ భారత్‌గా మారాలంటే.. పశ్చిమ బెంగాల్‌ను కూడా విక్షిత్‌ పశ్చిమ బెంగాల్‌గా మార్చడం ముఖ్యమని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు కొత్త శక్తిని నింపాల్సిన అవసరం ఉందని.. జ్ఞానం.. విజ్ఞాన కేంద్రంగా ’మేక్‌ ఇన్‌ ఇండియా’ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ’నిర్మమత (దయలేని) ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల మాల్దా, ముర్షిదాబాద్‌, సౌత్‌ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రధాన రహదారులు, రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించారు. ఈ క్రమంలోనే పోలీసులపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో లాఠీఛార్జీకి దారితీసింది. ముర్షిదాబాద్‌ ప్రాంతంలో పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసానికి దారితీసింది. ఈ ఘర్షణలపై కలకత్తా హైకోర్టు నియమించిన నిజనిర్ధారణ కమిటీ- ఇచ్చిన నివేదికతో ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్‌ చట్ట వ్యతిరేక నిరసనల ఫలితంగా చెలరేగిన మతపరమైన ఘర్షణలకు స్థానిక ఎమ్మెల్యే, నాయకులు కారణమని నివేదిక ప్రస్తావించింది. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఎత్తిచూపింది. ఈ వ్యవహారం భాజపా చేతిలో అస్త్రంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో తాజా ర్యాలీలో మమత ప్రభుత్వాన్ని మోదీ ఎండగట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులు కొన్ని ఇళ్లను గుర్తించి తగులబెడుతుంటే, పోలీసులు దానిని అడ్డుకోకుండా చూస్తూ ఉంటే.. అది ఎంతటి భయానక పరిస్థితో అర్థంచేసుకోండి. ఇక్కడి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదు. ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగేనా..? బుజ్జగింపు రాజకీయాల పేరిట గూండాలకు స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడ ప్రతి సమస్యకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఏదీ పరిష్కారం కాదని మోదీ దుయ్యబట్టారు. ఈ ర్యాలీలో ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రస్తావించారు. ఆ ఆపరేషన్‌ ఇంకా పూర్తికాలేదని బెంగాల్‌ గడ్డ విూద నిలబడి, 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నాను. ఏప్రిల్‌ 22 జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై బెంగాల్‌లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సిందూరం శక్తి ఏంటో మన ఆర్మీ ఉగ్రవాదులకు రుచి చూపించింది. మనం వారి ఇంట్లోకి ప్రవేశించి, మూడుసార్లు దాడులు చేశామని పాకిస్థాన్‌ అర్థం చేసుకోవాలని అన్నారు. 2016లో జరిగిన సర్జికల్‌ స్టయ్రిక్స్‌, 2019లో జరిగిన బాలాకోట్‌ దాడులు, ఇప్పటి ఆపరేషన్‌ సిందూర్‌ను ఉద్దేశించి మోదీ పరోక్షంగా ప్రస్తావించారు.