ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 2.10లక్షల మంది

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి): ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందన్నారు.పైలట్‌ ప్రాజెక్టులో 42వేల ఇళ్లు మంజూరు చేయగా.. 24వేలు ప్రారంభమయ్యాయని, సుమారు వంద ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ‘’లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను 40 శాతం పేర్లు ఇవ్వమన్నాం. మిగతా 60శాతం ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి. కేటీఆర్‌ జాబితా ఇవ్వలేదు.. అధికారులనే ఎంపిక చేయమన్నారు. ఐటీడీఏ పరిధిలో చెంచులకు 9,200 ఇళ్లు మంజూరు చేశాం. హైదరాబాద్‌లోని 16 స్లమ్స్‌లో నాలుగంతస్తుల భవనాలు నిర్మిస్తాం. వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిర్మిస్తాం’’అని మంత్రి తెలిపారు.