తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు

రాబోయే మూడ్రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజులు ఆదిలాబాద్‌, కొమరంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది.30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌లను జారీ చేసింది. జూన్‌ రెండో తేదీన రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. బాలాసోర్‌కు 180కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటనున్నదని తెలిపింది. ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం కూడా ఉన్నదని హెచ్చరించింది.