‘కాళేశ్వరం’ ఇంజనీరింగ్‌ అద్భుతం

` ఇది చైనా త్రీ గోర్జెస్‌ డ్యామ్‌కు సమానం
` సంపద సృష్టి, పంపిణీలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం
` 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన విదేశాలకు ఆదర్శం
` ` గ్లోబల్‌ టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌- బీఆర్‌ఎస్‌ సాధించిన విజయం
` మిషన్‌ భగీరథతో దేశంలో తొలిసారి కోటి ఇండ్లకు సురక్షిత తాగునీరు
` లండన్‌ బ్రిడ్జ్‌ ఇండియా ఇండియా వీక్‌ సదస్సులో కేటీఆర్‌
లండన్‌(జనంసాక్షి):ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం? అన్న అంశంపై లండన్‌ బ్రిడ్జ్‌ ఇండియా వీక్‌ 2025 సదస్సులో కేటీఆర్‌ ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు. అభివృద్ది, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక పంథాను అనుసరించి వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలు, ఆలోచనలను ఈ సదస్సులో కేటీఆర్‌ పంచుకున్నారు. సంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే తమ హయాంలో తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారకరామారావు. కేసీఆర్‌ నాయకత్వంలోని తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మధ్య అద్భుత సమతుల్యత సాధించిందన్న కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రగతిశీల పనులు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎవరు చేయలేదన్నారు. 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్‌ అద్భుతంగా వివరించారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు హాజరైన ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్‌, తలసరి ఆదాయంలో 12వ స్థానం నుండి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణ నుండి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చన్నారు. తమ హయాంలో పాలనను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి వ్యక్తుల కంటే విధానాలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విప్లవాత్మక మార్పులను ఆహ్వానించడంతో పాటు నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడమే తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా మార్చిందన్నారు కేటీఆర్‌. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొన్న ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్‌, ఇంజనీరింగ్‌ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీ గార్జియస్‌ డ్యామ్‌ కు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్ర మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకునిపోయి ప్రతీ సీజన్‌ కు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామన్నారు. ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం చాలా కష్టం అన్న కేటీఆర్‌, అందుకు కావలసిన అన్ని రకాల అనుమతులను తీసుకొని, ప్రాజెక్టుతో నష్టపోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామన్నారు. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న ఇండియాలో ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని అందించడం స్వప్నంగానే ఉన్న సమయంలో, కేసీఆర్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు మిషన్‌ భగీరథతో సురక్షిత మంచినీటిని అందించిందన్నారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఉపరితల నీటి వనరులతో ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని ఇప్పటికీ అందించడం లేదన్నారు. తలసరి ఆదాయంలో 156% వృద్ధిని ఒక్క దశాబ్ద కాలంలోనే సాధించిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ఒక్కటే అన్నారు కేటీఆర్‌. 2014లో తలసరి ఆదాయంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిశీల విధానాలతో 2023 నాటికి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుందన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా %Gశీశీస్త్రశ్రీవ%, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ ,ఫేస్బుక్‌ తో పాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్‌ కంపెనీలు అమెరికా తర్వాత తమ అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాదులో నెలకొల్పాయని కేటీఆర్‌ చెప్పారు. కార్పొరేట్‌ సంస్థల్ని హైదరాబాద్‌ కు ఆహ్వానించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. తాము అధికారంలోకి రావడానికి ముందు 2014 లో టెక్‌ పరిశ్రమలో మూడు లక్షల 23వేలు ఉద్యోగాలు మాత్రమే ఉండేవని, అయితే తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అవి పది లక్షలకు చేరాయన్నారు. ఇంతేకాదు 2014లో 56 వేల కోట్ల రూపాయలుగా ఉన్న ఐటీ ఎగుమతులు, 2023 నాటికి రెండు లక్షల 41 వేల కోట్ల రూపాయలకు చేరాయన్నారు. ఇదంతా తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, మార్గదర్శకత్వంతోనే సాధ్యమైందని తెలిపారు. ఇండియా లాంటి వైవిధ్యభరిత దేశంలో ఒక పరిశ్రమ, సంస్థను ఏర్పాటుచేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయన్న కేటీఆర్‌, ఆ సంక్షిష్టతను టీఎస్‌ ఐపాస్‌ తో తాము దూరం చేశామన్నారు. ఆన్‌ లైన్‌ లో ఎవరైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు. ఒకవేళ రాకుంటే అనుమతులు వచ్చినట్టుగానే భావించి పరిశ్రమను ప్రారంభించుకోవచ్చన్నారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధానం లేదన్నారు. టీఎస్‌ఐపాస్‌ తో తమ హయాంలో 28 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్న కేటీఆర్‌, ఫలితంగా మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయన్నారు. 24 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పన జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ గా ఎదిగిందన్నారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరిన కేటీఆర్‌, ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను అందుకే ఫస్ట్‌ ఛాయిస్‌ గా ఎంచుకోవాలన్నారు. అపార అవకాశాలను అందించడంతో పాటు కలల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ తెలంగాణ లైట్‌ హాజ్‌ లాంటిదన్నారు కేటీఆర్‌. ఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అన్నారు.తన ప్రసంగంతో తెలంగాణ సక్సెస్‌ జర్నీని సాధికారికంగా వివరించిన కేటీఆర్‌, బ్రిడ్జ్‌ ఇండియా సదస్సులో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ గా నిలిచారు. సదస్సుకు హాజరైన వివిధ దేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కేటీఆర్‌ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. ఆయన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

 

తాజావార్తలు