రైతుల కోసం మౌనదీక్ష

3

– గాంధీ పుట్టినరోజున సత్యాగ్రహం

– కోదండరాం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతు సమస్యలపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్‌ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. త్వరలో ‘ఛలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని రైతులతో పెద్ద ఎత్తున చేపడతామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 2న మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ప్రకటించారు. ‘తెలంగాణ రైతుల దుస్థితి- కరవు, పంట రుణాలు’ అంశంపై హైదరాబాద్‌లో తెలంగాణ రైతు జేఏసీ చేపట్టిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కోదండరామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ రంగం దుస్థితిపై ఒక రోజంతా చర్చించాలని డిమాండ్‌ చేశారు. నూతన వ్యవసాయ విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. రైతులకు పంట రుణాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్‌ 2 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకుని… తర్వాత చలో హైదరాబాద్‌ పిలుపు ఇవ్వనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. జెఎసిపై విమర్శలకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా ప్రజల ఎజెండాతో ముందుకు వెళుతున్నామని అన్నారు. నాడూనేడూ తమది ఒకటే పాత్రని అన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌ 2న గాంధీ సమాధి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపడతామని చెప్పారు. రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఒక్కరోజు మొత్తం అసెంబ్లీలో వ్యవసాయం అంశంపైనే ప్రభుత్వం చర్చించాలన్నారు. నిర్వాసిత రైతులకు భూమికి పరిహరంగా భూమి ఇవ్వాలని కోరారు.