ప్రముఖ సాహితీవేత్త చేరా ఇక లేరు

22A

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :

ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావు (80) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. చేరాగా సుప్రసిద్ధులైన రామారావు ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించారు. భాషా పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా ఖ్యాతి గడించారు. 1934 అక్టోబర్‌ 1న ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందలపాడులో జన్మించిన ఆయన అమెరికా కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. ఆయన రచించిన ‘స్మృతి కిరణాంకం’కు 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ముత్యాలసరాల ముచ్చట్లు, ఇంగ్లిష్‌-తెలుగు పదకోశం, తెలుగులో వెలుగులు (భాష పరిశోధన వ్యాసాలు), 20కిపైగా చేరా పీఠికలు, తెలుగు వాక్యం, కవిత్వానుభవం ఆయన రాసిన పుస్తకాల్లో ప్రసిద్ధమైనవి. చేరాతలు పేరుతో ఏళ్ల తరబడి సాహితీ కాలమ్‌ నిర్వహించి పాఠకుల మన్ననలు పొందారు.