అర్హులందరికీ ఫీజు

4

తప్పుడు ధృవపత్రాలు వస్తే కలెక్టర్లదే బాధ్యత
తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్‌ భరోసా

హైదరాబాద్‌, ఆగస్ట్‌1 (జనంసాక్షి) : అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తప్పుడు ధృవపత్రాలు వస్తే కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆంధ్రా విద్యార్థులకు బోధన రుసుములు ఇచ్చే ప్రసక్తేలేదని ఆయన చెప్పారు. అలా ఇస్తే ఇతర రాష్ట్రాల విద్యార్థులు సైతం తమకు కూడా కావాలని కోరుతారని అన్నారు. వీరందిరికి ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామని అన్నారు. ఫీజుల చెల్లింపులో తెలంగాణలోని అర్హుడైన ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగనివ్వబోమని భరోసానిచ్చారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో సమగ్ర కుటుంబ సర్వే అవగాహన కార్యక్రమాన్ని కేసీఆర్‌ ప్రారంభించిన సందర్భంగా  మాట్లాడుతూ ఫీజులపై మరోమారు ప్రభుత్వ విధానాన్ని స్పష్టంచేశారు.  తప్పుడు స్థానిక ధ్రువీకరణ పత్రాలు ఇస్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులను హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థులకే మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, పొరుగు రాష్ట్రాల వారికి చెల్లించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి స్పష్టంచేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటోందన్నారు. అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామని ఆయన చెప్పారు. విద్యార్థుల స్థానికతను ధృవీకరించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పు ఇచ్చాయని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఫీ రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఆందోళన అవసరంలేదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగనివ్వమని హావిూఇచ్చారు. అధికారులు చేసే చిన్న పొరపాటుకు భవిష్యత్‌ తరాలు నష్టపోకూడదన్నారు. తప్పుడు ద్రువీకరణ పత్రాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. తర్వాత ప్రభుత్వాన్ని నిందిస్తే ఉపయోగం ఉందని ఆయన అన్నారు. జిల్లాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అలాంటివారిపై చర్యలు తీసుఏకుంటామని కూడా హెచ్చరించారు. ఏ జిల్లాలోనూ తప్పుడు సర్టిఫికెట్లు ఉండొద్దని, తప్పుడు ద్రువీకరణ పత్రాలు వస్తే కలెక్టర్లదే బాధ్యత కేసీఆర్‌ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు తమ ప్రభుత్వం చేయదని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖను ఇక నుంచి దళిత అభివృద్ధి శాఖగా మార్చుతున్నట్లు వెల్లడించారు. దళిత అభివృద్ధి శాఖ తన వద్దే ఉంటుందని తెలిపారు. తెలంగాణలో 20లక్షలకు పైగా అదనపు రేషన్‌కార్డులు ఉన్నాయని, వాటి వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లితుందన్నారు. ఖజానాకు ప్రభుత్వం ధర్మకర్తగా ఉండాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలన్నీ కంప్యూటరీకరించాలని, ప్రభుత్వ నిధలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో 12 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, అర్బన్‌లో 3 లక్షలు, గ్రామాల్లో 9 లక్షల దళితుల కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామని, సర్వేలో వాస్తవాలు తేల్చాలని అధికారులకు తెలియజేశారు. వ్యవసాయానికి అనుకూలంగాలేని భూములను పరిశ్రమలకు వాడనున్నట్లు ఆయన చెప్పారు. భూమిలేని దళిత కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని, మూడెకరాల భూమి ఖచ్చితంగా ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అంగుళం  భూమిని  వదలకుండా సద్వినియోగం

రాష్ట్రంలో అందుబాటులో ఉందనుకుంటున్న 20లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేసుకోవాలని, అంగుళం కూడా వదలకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  హైటెక్స్‌లో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన పలువిషయాల్లో దిశానిర్దేశర చేశారు. కలెక్టర్లు ఫేజ్‌ 1, ఫేజ్‌ 2, ఫేజ్‌ 3 ప్రకారం సర్వేలు నిర్వహించాలన్నారు. తక్షణమే వినియోగించుకునే భూమిని ఫేజ్‌ 1లో సర్వే చేయాలని, కొండ ప్రాంతాల భూమిని సోలార్‌ విద్యుత్‌ కోసం ఫేజ్‌ 3లో సర్వే చేయాలని, ప్రతి అంగుళం భూమిని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించు కోవాలని ఆయన పేర్కొన్నారు. వాస్తవంగా మిగిలి ఉన్న ప్రభుత్వ భూమి సర్వేల ద్వారా తేలిపోవాలన్నారు.