ఆర్బీఐ వద్దకు చేరని రూ. 2000 నోట్లు ఇంకా ఎన్ని ఉన్నాయంటే?
ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ, అవి ఇంకా పూర్తి స్థాయిలో వెనక్కి రాలేదు. ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ వేల కోట్ల రూపాయల విలువైన రెండువేల నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 మే 31 నాటికి ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తేలింది. 2023 మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో ఇప్పటికే 98.26 శాతం తమ వద్దకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.వాస్తవానికి, ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ప్రభుత్వం 2023 అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత, అంటే 2023 అక్టోబర్ 9వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వ్యక్తులు లేదా సంస్థలు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేసుకునే వెసులుబాటు కల్పించింది.