ఏపీలో యోగాంధ్ర 2025లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మోదీ స్పందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములవుతున్నారు.యోగాంధ్రలో భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్ హిల్స్లో దాదాపు రెండు వేల మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరు యోగాసనాలు వేస్తున్న ఫోటోలను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ట్వీట్ను రీ-పోస్ట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవంపై ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మోదీ సూచించారు.