రాజ‌కీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు.. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ క‌విత ఆగ్రహం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐపీ)పై జరుగుతున్న విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాజ‌కీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చార‌ని ఆమె విమ‌ర్శించారు. ఈ ప్రాజెక్టులో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌కు ఇటీవల నోటీసులు జారీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డం అంటే… మొత్తం తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. ఈ చర్యను నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో ఆమె నిరసనకు దిగారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… “ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది జవాబుదారీతనం కోసం కాదు. కేవలం రాజకీయంగా పరువు తీయడం కోసం. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. కేసీఆర్ ఏం తప్పు చేశారు? ఆయనకు నోటీసులు ఇస్తే, యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే” అని ఆమె అన్నారు.తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఒక పరివర్తనాత్మక కార్యక్రమంగా కాళేశ్వరం ప్రాజెక్టును కవిత పేర్కొన్నారు. 21 పంప్ హౌస్‌లు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1500 కిలోమీటర్ల కాలువలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని ఆమె గుర్తుచేశారు. “కాళేశ్వరాన్ని రైతుల సంక్షేమం, భవిష్యత్ తరాల కోసం నిర్మించారు కానీ, రాజకీయాల కోసం కాదు. ఈరోజు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ పోరాడి సాధించుకున్న ప్రగతిని నాశనం చేస్తోంది. ఎలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకున్నా, ఏ ప్రభుత్వం కూడా కేసీఆర్ వారసత్వాన్ని తగ్గించలేదు” అని క‌విత‌ పేర్కొన్నారు.నిజం కచ్చితంగా బయటకొస్తుందని, తెలంగాణ ప్రజలకు నిజంగా ఎవరు సేవ చేశారో చరిత్ర గుర్తుంచుకుంటుందని ఆమె తెలిపారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాలని డిమాండ్ చేసిన కవిత, కాంగ్రెస్, బీజేపీలు సాగునీరు, రాష్ట్ర సంక్షేమం విషయంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ కుట్ర అని ఆమె విమర్శించారు. కాగా, కేసీఆర్‌తో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే.