మొక్కలు పెంచకుంటే జరిగేది ఇదే!: మంత్రి పొన్నం

ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడంపై నిర్లక్ష్యం వహిస్తే, భవిష్యత్ తరాల వారు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్ మాస్కులు ధరించి తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లోని గోల్కొండ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైతే మానవాళి అనేక రకాల నూతన వ్యాధుల బారిన పడుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మొక్కలు నాటడాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారానే పర్యావరణ సమతుల్యతను కాపాడుకోగలమని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని భవిష్యత్ తరాలకు అందించగలమని ఆయన తెలిపారు. పర్యావరణ హిత చర్యలకు ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

తాజావార్తలు