ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?: కేటీఆర్

హైదరాబాద్  ( జనం సాక్షి): హైదరాబాద్ నగరం మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ మాట్లాడుతూ, “గుజరాత్‌ రాష్ట్రానికి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. మరి, హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు అనుమతులు ఇవ్వలేరా?” అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని గుర్తు చేస్తూ, వారంతా రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు చొరవ చూపడం లేదని విమర్శించారు. వారి నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆయన ఆరోపించారు.