అధినేతలు వెంటరాగా..

ప్రణబ్‌, సంగ్మా రాష్ట్రపతి అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు
న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి):ఇస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ 14వ రాష్ట్రపతి పదవికి ఎన్డీఎ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్‌ టి.ఎ సంగ్మా గురువారం తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు నితీన్‌ గడ్కరితో పాటు సీనియర్‌ నేతలు ఎల్‌కె అద్వాని, సుష్మాస్వరాజ్‌, మురళిమనోహర్‌జోషి, ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలైన బిజెడి నేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఎస్‌ఎడి చీఫ్‌ ప్రతాప్‌సింగ్‌ బాదల్‌, జనత పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి తదితరులు హాజరయ్యారు. నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం సంగ్మా మాట్లాడుతూ తనకు మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి తన పేరును ప్రతిపాదించిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌కు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. గెలుపుఓటములపై సంగ్మా పెద్దగా స్పందించడం లేదు. భారత పౌరుడిగా తనకు సంక్రమించిన హక్కు ద్వారా ఈశాన్య భారతానికి చెందిన గిరిజనుడిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఈ ఉదయం యుపిఎ తరఫున ప్రణబ్‌ ముఖర్జీ తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ప్రణబ్‌ నామినేషన్‌ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్ప యుపిఎ పక్షాల నేతలు అంతా హాజరయ్యారు. అలాగే సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్‌, ఆర్‌జెడి నేత లాలూప్రసాద్‌, ఎల్‌జెపి నేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తదితరులు హాజరయ్యారు.
యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌గాంధీ, యుపిఎ కూటమికి చెందిన లాలూ ప్రసాద్‌యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌తో కలిసి వచ్చి ఆయన నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ పత్రాలపై సోనియాగాంధీతో సహా దాదాపు 480 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. ఒక్కొక్క నామినేషన్‌పై 60మంది ప్రతిపాదితులు, 60 మంది మద్దతు దారులు సంతకాలు చేశారు. జనతాదళ్‌ (యునైడెట్‌)చీఫ్‌ శరద్‌యాదవ్‌ ఒక నామినేషన్‌ పత్రంపై సంతకం చేశారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. మిగత యుపిఎ భాగస్వామ్య పక్షాలన్నీ హాజరయ్యాయి.