గోపాలమిత్ర సమస్యలను పరిష్కారించాలి

నిజామాబాద్‌, జూలై 25 : గోపాలమిత్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కూడా దీక్షలు కొనసాగాయి. కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్‌ మాట్లాడుతూ, గోపాలమిత్ర సర్వీస్‌ను గుర్తించి ప్రభుత్వం 10వేల రూపాయలు కనీస వేతనంగా అందించాలన్నారు. గోపాలమిత్రలో ఇంటర్‌ బైపిసి చదివిన వారిని పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ ఉద్యోగాల్లో నియమించాలన్నారు. సీనియర్లను గోపాలమిత్రలో మాత్రమే డిఎల్‌డిఎలలో సూపర్‌వైజర్‌ పోస్టుల్లో నియమించాలన్నారు. గోపాలమిత్ర జీవనోపాధి మెరుగు పర్చేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ని కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నాలో గోపాలమిత్ర అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మలానా, ఉపాధ్యక్షుడు మహిపాల్‌, జాయింట్‌ కార్యదర్శి తిరుపతి, గిరిమయ్య, నర్సయ్య, అంజనీకుమార్‌లు తదితరులు పాల్గొన్నారు.