నల్గొండలో దారుణం

` సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫోటోలు పెట్టారని ఇద్దరు యువతుల బలవన్మరణం
నల్లగొండ(జనంసాక్షి):నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఇద్దరు యువతులు నిన్న రాజీవ్‌ పార్క్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన మనీషా, నక్కలపల్లికి చెందిన శివానీ అనే ఇద్దరు యువతులు హాస్టల్‌లో వుంటూ నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(బీజడ్‌సీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన వీరు మంగళవారం ఎగ్జామ్‌ ఉందని కాలేజీకి వెళ్లారు. ఎన్జీ కాలేజీ వెనుక ఉన్న రాజీవ్‌ పార్కుకు వెళ్లిన ఇద్దరు యువతులు గడ్డి మందు తాగారు. తాము పురుగుల మందు తాగామని హాస్టల్లోని తమ ఫ్రెండ్స్‌కు సమాచారం అందించారు. దీంతో స్థానికులు, పోలీసులు వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఇద్దరూ యువతులు మృతి చెందారు. యువతుల మృతిపై పలు అనుమానాలను వ్యక్తమవుతున్నాయి.శివానీ, మనీషాలు ఇద్దరూ ఫ్రెండ్స్‌ అని, ఎగ్జామ్‌ ఉందని నల్లగొండకు వెళ్లారని శివానీ తండ్రి చెబుతున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రాంనగర్‌ పార్కులో ఇద్దరు గడ్డి మందు తాగారని పోలీసులు సమాచార ఇవ్వడంతో తాము వెళ్ళామని తండ్రి చెబుతున్నారు. వీరిద్దరూ ఆత్మహత్యయత్నానికి కారణం ఏందో తెలియదని చెబుతున్నారు. ఈ ఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతుల సెల్‌ ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు పంపారు. అయితే వాట్సాప్‌ అకౌంట్‌కు డీపీగా పెట్టుకున్న ఫోటోలను కొందరు యువకులు మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేసి, బెదిరింపులకు పాల్పడినందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.