నియోజకవర్గ అభివృద్ధికి కృషిగుంటూరు,

జూన్‌ 24 : ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ టిజెఆర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజక అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం పెదనందిపాడులో కోడూరి రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీలో మహామహానాయకులే బయటకు వెళ్లి తిరిగి వచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధికి నోచుకోని ఎన్నో ప్రాంతాలను తాను గుర్తించానని, పార్టీ నాయకులు, ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, నరసయ్య, వెంకట్రావు, రాజశేఖర్‌, హనుమంతరావు, కామేశ్వరరావు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.