లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ జోరు

భారత స్టార్‌ షట్లర్‌,ఒలింపిక్‌ పతక ఆశాజ్యోతి సైనా నెహ్వాల్‌ జోరు ప్రారంభమైంది.ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో స్విట్జార్లాండ్‌ క్రీడాకారిణి సబ్రినా పై వరుస సెట్లలో విజయం సాధించింది.వరల్డ్‌ నెం.5ర్యాంకర్‌ అయిన సైనా, 65వ ర్యాంక్‌ ప్రత్యర్థిపై సునాయాస విజయం సాధించింది. కేవలం 22నిమిషాల్లోనే 21-9, 21-4తేడాతో ప్రత్యర్థిని మట్టికరింపించింది. 2012యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌కు చేరడం ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సబ్రినా..ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ మాత్రమూ పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆట ప్రారంభం నుంచే సైనా ఆధిపత్యం సాధించింది. థారులాండ్‌ గ్రాండ్‌ ప్రి, ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌లను కైవసం చేసుకొని, ఈ మెగా ఈవెంట్‌లోకి అడుగుపెట్టిన సైనా కేవలం 12నిమిషాల్లోనే తొలి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి రెండో గేమ్‌ను కేవలం 10నిమిషాల్లోనే ముగించింది. తొలి మ్యాచ్‌లోనే మంచి విజయంతో ఉత్సాహంతో ఉన్న సైనా సోమవారం గ్రూప్‌-ఇలో బెల్జియం క్రీడాకారిణి లియాన్నే తాన్‌తో తలపడుతుంది.