తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి

` విదేశీ పర్యటనల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి
` ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్ధతివ్వండి
` విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి
ఢల్లీి(జనంసాక్షి):రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి గురువారం కలిశారు. ఈసందర్భంగా 2025 సంవత్సరంలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్‌ వరల్డ్‌, గ్లోబల్‌ డీప్‌ టెక్‌ సదస్సు, భారత్‌ సమ్మిట్‌, యానిమేషన్‌ గేమింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్‌ వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్‌ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను సీఎం కోరారు. తెలంగాణ రైజింగ్‌ను విదేశాల్లో భారత్‌ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్‌ సహాయంతో హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్‌లో చేపట్టే కార్యక్రమాలకు తమ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జైశంకర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియజేశారు. కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, నాగర్‌ కర్నూలు, భువనగిరి లోక్‌సభ సభ్యులు డాక్టర్‌ మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

 

గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం
` దాని కోసం ఎవరితోనూ ఫోటోలు దిగి నిరూపించుకోవాల్సిన అవసరంలేదు
` తెలంగాణలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం
` అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం
` కేసీఆర్‌ గవర్నర్‌ ప్రసంగానికి కాదు.. చర్చకు రావాలి
` ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు
` ఢల్లీి మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన వారికి ఇచ్చిన మాటను నిబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని.. అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఢల్లీిలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చానన్నారు. అలాగే అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌ నాయక్‌కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామని తెలిపారు. గాంధీ కుటుంబంతో తనకు అనుబంధం అంతకు మించి ఉందని.. ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర కేబినెట్‌లో ఉన్న నిర్మలా సీతారామన్‌ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రం అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందని.. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు భారత్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. 60 దేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నామన్నారు. దానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అనుమతి కావాలని.. అందుకే విదేశాంగ శాఖ మంత్రిని కలుస్తున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్‌ విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానన్నారు. దానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత డీఎంకే మీటింగ్‌లో తమ వైఖరి చెప్తామన్నారు. పన్నులు వసూలులో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోయినా, ప్రజలు ప్రాణాలు పోతున్నా బీఆర్‌ఎస్‌ నేతలు డ్యాన్సులు వేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ గవర్నర్‌ ప్రసంగానికి కాదు.. చర్చకు రావాలి
మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వస్తే వారే చేసిన తప్పులేంటే వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వస్తే అర్థం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఒక్క పాలసీ తేలేదన్నారు. తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవ్వరూ చేయలేదని పేర్కొన్నారు. నిరుద్యోగాన్ని 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టి నాటి నుంచి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకి తెచ్చినట్లు వెల్లడిరచారు. పన్ను వసూళ్లలోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందంటూ రేవంత్‌ తెలిపారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే, టన్నెల్‌?లో ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదంటూ సీఎం రేవంత్‌ అన్నారు. తానేవరూ తెలికుండానే పీసీసీ, ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారా? అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో తనకు విబేధాలు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు రేవంత్‌. తెలంగాణ సీఎంగా ఉన్నా కాబట్టే రాష్ట్రంలో తనను ప్రశ్నిస్తున్నారని, అలాగే కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ఉన్నారు కాబట్టే ఆయన్నీ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ప్రశ్నిస్తున్నారని అన్నారు. మిగతా రాష్ట్రాల కేంద్రమంత్రులు వారివారి రాష్ట్రాలకు కావాల్సినవన్నీ సాధించుకుంటున్నారని, కానీ కిషన్‌ రెడ్డి మాత్రం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను ఆరు గ్యారెంటీలు అడగడం లేదని, తెలంగాణకు ప్రధాని ప్రకటించిన రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో, మూసీ, కేంద్ర ప్రాజెక్టులు మాత్రమే అడుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. మెట్రోకి క్యాబినెట్‌ అనుమతి వస్తే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. హైదారాబాద్‌ గేమ్‌ ఛేంజర్‌ మెట్రో అంటూ రేవంత్‌ చెప్పుకొచ్చారు.