ఏటీఎంలో చోరీ యత్నం..
హైదరాబాద్, మార్చి 04: నగర శివారులోని మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ చొటు చేసుకుంది. దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఊహించని పరిణామంతో దుండగులు ఒక్కసారిగా అవాక్కయి.. అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసిన దుండగులే ఈ చోరీకి యత్నించినట్లు తమ విచారణలో పోలీసులు గుర్తించారు.మైలార్ దేవ్ పల్లి కంటే 30 నిమిషాల ముందు రావిర్యాలలో ఏటీఎంను గ్యాస్ కట్టర్ సహాయంతో ధ్వంసం చేసి.. అందులోని రూ. 13 లక్షల నగదును ఈ దుండగులు ఎత్తికెళ్లారు. అనంతరం కార్లో పరారవుతూ.. మార్గమధ్యంలో మైలార్ దేవ్ పల్లిలోని ఎస్బీఐకు చెందిన ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎంలలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.దీంతో ఈ చోరీలకు పాల్పడింది.. హర్యానా మేవత్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ చోరీ ఘటనపై రాచకొండ, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో నిందితులను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దుండగుల కోసం ఆ యా బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.