అంబేడ్కర్‌ ఆశయాలు సదా అనుసరణీయం

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా  ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న వేళ ఆ మహానుభావుడి కృషిని, ఆయన సేవలను తలచుకునే అవకాశం ప్రజలకు కలిగింది. ఐక్యరాజ్య సమితి ఒకరోజు ముందే 13న ఆయనకు నివాళిగా కర్యాక్రమాలను చేపట్టి, ఆ మహానుభావుడి పేరును విశ్వవ్యాప్తం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకుని వెల్లడంలో బాగా శ్రమిస్తున్నారు. ఆయనకు దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదన్న మోడీ ఆవేదనలో అర్థం ఉంది. ఇటీఅవలే ఢిల్లీలో అంబేడ్కర్‌ స్మారక భవనానికి శంకుస్థాపన చేసి, ఆయన ఆశయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించారు. ఆయన ఆలోచనా ధోరణి నేటికీ అనుసరణీయమని గుర్తించారు. అంబేడ్కర్‌ కేవలం దళితులకే ఆరాధ్యుడుకాదన్న వాదన నూటికి నూరుపాళ్లు నిజం. ఆయన ఓ మేధావి. ఆయన చూపిన మార్గం అనుసరించి ఉంటే దేశం మరోరకంగా ఉండేది. ఆయన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసి ఉంటే దేశ పరిస్థితులు మరో రకంగా ఉండేవి. కానీ ఇప్పటికైనా అంబేడ్కర్‌ భావజాలంలోని మంచిని గ్రహిఒంచి ముందుకు సాగితే మంచిది. ఆయన చూపిన బాటలో రాజ్యాంగ పరిదులకు లోబడి ముందుకు సాగితే మంచిది.  కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు నెల 14 నుంచి 24 వరకు గ్రామ ఉదయ్‌సే భారత్‌ ఉదయ్‌ యోజన కార్యక్రమం చేపట్టనున్నారు. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తు కార్యక్రమాలకు ఆదేశించారు. ఇందులో  గ్రామస్థులు అందరినీ భాగస్వాములను చేయాలని, ముఖ్యంగా మహిళలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. సర్పంచ్‌ల నాయకత్వంలో దీనిని ముందుకు తీసుకుని వెళ్లాలన్న ఆలోచన మంచిదనేచెప్పాలి. బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛ భారత్‌లో భాగంగా అంబేద్కర్‌ విగ్రహాలు, పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమాలను చేపట్టనున్నారు.  కార్యకర్తలతో కలసి వివిధ ప్రాంతాల్లోని అంబేద్కర్‌ విగ్రహాలను శుభ్రపరిచి అలంకరిస్తారు. ఏప్రిల్‌ 14 డాక్టర్‌ అంబేద్కర్‌ జయంతి నుంచి 24 పంచాయతీ దివస్‌ వరకు జరిగే కార్యక్రమాలలో అంబేద్కర్‌ జీవిత విశేషాలను అన్ని గ్రామాలలో సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. అయితే విగ్రహాలను పూజించడం వరకే కార్యక్రమాలను పరిమితం చేయకుండా ఆయన చిసన సేవలను గుర్తుంచుకుని శాశ్వత కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెల్లాలి. అసమానతలు లేని సమాజం కోసం ఎలాగైతే అంబేడ్కర్‌ పరితపించారో అందుకు అనుగుణంగా పనిచేయాలి. పాలకవర్గాలు ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నాయి. భక్తి ప్రపత్తులతో ఆ మహానేతకు నివాళులర్పిస్తున్నాయి. దళితుల కోసం అనేక పోరాటాలు చేసి, వారి సంక్షేమం కోసం అహరహం పనిచేసిన దళిత బాంధవుడు డాక్టర్‌ అంబేద్కర్‌ను స్మరించుకునేందుకు, ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఆయనకు భారతరత్న ఇచ్చింది తామేనని ఒకపార్టీ ప్రచారం చేసుకుంటే, ఆయనను మా పార్టీ గౌరవించినంతగా మరెవరూ గుర్తించలేదని మరొక పార్టీ వాదించుకుంటోంది.తెలుగు రాష్ట్ర పాలకులు అందరికంటే ఒక అడుగు ముందుకేశారు. అంబేద్కర్‌ విగ్రహాలను భారీ స్ధాయిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అమరావతిలో 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుచేయాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హైదరాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుచేయాలని ఆదేశిస్తూ, ఆ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దళితుల కోసం తుది శ్వాస వరకూ పోరాడిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ద్వారా,

ఆయనకు నివాళులర్పించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రయత్నాలు, కృషి అభినందనీయమే. ఆ మేరకు వారిద్దరూ చరిత్రలో నిలిచిపోవచ్చు. వారి నిర్ణ యాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదు. అయితే కేవలం విగ్రహాలతోనే నివాళి సరికాదు. అసమానతలు లేని సమజాం కోసం కలలు కన్న అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలి. అణగారిన వారికి అండగా నిలవాలి. వారికి అన్న రంగాల్లో సమాన హక్కులు కలిగేలా చూడాలి. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పరితపించిన అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న నేతలుగా నిరూపించు కోవాలి. కులరహిత సమాజం కోసం పాటుపడాలి. కులా కుంపట్లను తొలగించే ప్రయత్నం చేయాలి.  కుల రహిత, స్త్రీ-పురుష సమానత్వం కోసం చివరివరకూ పోరాడిన మహానేత అంబేడ్కర్‌. ఆ మహానుభావుడి జయంతి రోజున ఓ మంచి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించబోతోంది. ఇది అంకురంగా ముందుకు సాగి భారత్‌ యావత్తూ ఇందుకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంది. అంబేడ్కర్‌ ఆశయాలను కేవలం దళితులకే ఆపాదించకుండా ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా చూడాలి.ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లే క్రమంలో చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.