మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి
` ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాకే భారత్‌ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు పెంచింది
` భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న అమెరికా
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. అమెరికాతో వాణిజ్య భాగస్వాములైన భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు తమ గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.వారు తమ మార్కెట్లను తెరిచి.. అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. స్విట్జర్లాండ్‌, బ్రెజిల్‌, భారత్‌ వంటి దేశాలను అగ్రరాజ్యం మరింత సరిచేయాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో ప్రేలాపనలు చేశారు. ఆయా దేశాలు తమతో ఆలోచించి మాట్లాడాలని అన్నారు. రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టాకే భారత్‌ రాయితీపై రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెంచిందని హోవార్డ్‌ లుట్నిక్‌ ఆరోపించారు. ఇప్పటికైనా ఎవరివైపు ఉండాలనే విషయంపై మోదీ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.లుట్నిక్‌ గతంలోనూ ఇదే విధంగా భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత్‌, కెనడా, బ్రెజిల్‌ వంటి దేశాలు అమెరికాలో విక్రయాలు చేపడుతూ.. ప్రయోజనాలు పొందుతున్నారని.. కానీ, తమను మాత్రం ఆయా దేశాల్లో విక్రయాలు చేపట్టకుండా అడ్డుకుంటు న్నాయని అన్నారు. ఏళ్ల తరబడి తాము ఈ సమస్యను ఎదుర్కొన్నాం కాబట్టే సుంకాలు విధించామన్నారు. తమతో వాణిజ్యం చేసే దేశాలు దీనిని అంగీకరించక తప్పదని అన్నారు. ఇరుదేశాల మధ్య సుంకాల వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌- అమెరికా మధ్య సుంకాల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై టారిఫ్‌లను 50 శాతానికి పెంచారు. గత నెల నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అమెరికా అదనపు సుంకాలు సహేతుకం కాదని భారత్‌ ఇప్పటికే ఖండిరచింది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలకు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే.. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడం అంత తేలికైన విషయం కాదని, రష్యాపై చర్యల కోసం దిల్లీతో విభేదానికి సిద్ధమయ్యామని ట్రంప్‌ ఇటీవల పేర్కొన్నారు.