అక్టోబరు 10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు : టీడబ్ల్యూజేఎఫ్

కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనం సాక్షి :

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బవసపున్నయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 35 ఏండ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని చెప్పారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘డిమాండ్స్ డే’ను చేపట్టినట్టు వివరించారు. డిమాండ్స్ డే రోజున ఇండ్లస్థలాలు, ఆర్టీసీ బస్సు పాసులు, టోల్ గేట్ సమస్యలు, జర్నలిస్టు బంధు, రైల్వేపాసులపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని జర్నలిస్టులకు సూచించారు. కలెక్టరేట్ల ముందు శాంతియుత ప్రదర్శనలు చేయాలని కోరారు. బ్యానర్లు, ప్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని డిమాండ్స్ డేను నిర్వహించాలని ఫెడరేషన్ శ్రేణులకు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విస్తృతంగా పాల్గొనాలని కోరారు . అలాగే జర్నలిస్టులకు ప్రస్తుతం ఆర్టీసీ ఇస్తున్న 75 శాతం రాయితీ సరిగ్గా అమలుకావడం లేదని చెప్పారు. డీజిల్ సెస్, టోల్ గేట్ల ఫీజులతో రాయితీ కేవలం 50 శాతం మాత్రమే అమలవుతున్నదని తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, రాయితీని పూర్తిగా అమలుచేస్తూనే బస్సుపాసు సౌకర్యాన్ని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలని కోరారు. పేదలైన జర్నలిస్టులను ఆదుకునేందుకు ‘జర్నలిస్టు బంధు’ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా కాలంలో ఎత్తేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలనీ, రాయితీని వంద శాతానికి పెంచాలని కోరారు. ఈ సౌకర్యాన్ని కూడా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ జిల్లా కలెక్టర్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ లేఖలు రాసి రైల్వే పాసులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.