ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఆరోగ్య వివరాలు ఉండాలి


క్యూఆర్‌ కోడ్‌తో అన్నీ తెలుసుకోగలగాలి
విలేజ్‌ క్లీనిక్‌లో సాధారణ పరీక్షలు జరిగేలా చూడాలి
డిజిటల్‌ హెల్త్‌పై సవిూక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు
అమరావతి,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఆరోగ్యశ్రీకార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్‌కోడ్‌ రూపంలో అందుబాటులో ఉండేలా చూడాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. విలేజ్‌ క్లీనిక్స్‌లో కూడా డేటా వివరాల నమోదుతో పాటు ప్రతి విలేజ్‌, వార్డు క్లీనిక్స్‌లో కూడా కంప్యూటర్‌ ఉండాలని అధికారులను ఆదేశించారు. విలేజ్‌ క్లీనిక్స్‌లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి రావాలని, షుగర్‌, బీపీ, బ్లడ్‌ గ్రూప్‌ సహా ఇతర వివరాలు కార్డులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుపై ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆరోగ్యశ్రీ, ఆధార్‌ నెంబర్‌ చెప్పినా వెంటనే ఆరోగ్య వివరాలు వచ్చే విధానం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్‌ హెల్త్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సవిూక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై విలేజ్‌ క్లీనిక్స్‌ అత్యంత దృష్టిపెడుతున్నాయి, అదే క్రమంలో గ్రామాల్లో కాలుష్యం కూడా దృష్టిపెట్టాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలిని, ఈ క్రమంలో విలేజ్‌ క్లీనిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిక్రూట్‌మెంట్‌ చేయాలని, మూడు నెలల్లో సిబ్బంది భర్తీ పక్రియ పూర్తి కావాలిని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ నుంచి పైస్థాయి ఆస్పత్రులకు కూడా కాంపౌండ్‌వాల్‌ ఉండాలని తెలిపారు.