ఆర్టీసీ సమ్మె విరమణ

C
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు

– 44 శాతం ఫిట్‌మెంట్‌

– 4300 కాంట్రాక్టు కార్మికులు నేటి నుంచి రెగ్యులరైజ్‌

– బడ్జెట్‌లో ఏటా కేటాయింపులు

– సీఎం కేసీఆర్‌ వెల్లడి

హైదారబాద్‌,మే13(జనంసాక్షి):

తెలంగాణలో ఆర్టిసి సిబ్బందికి 44శాతం ఫిట్‌మెంట్‌ పెంచాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. జూన్‌ నుంచి దీనిని అమలు చేస్తామని అన్నారు. బకాయిలను యాభై శాతం బాండ్లుగాను, మిగిలిన యాభై శాతం మూడు దఫాల్లో చెల్లించేలా కార్మికులకు హావిూఇచ్చారు. దసరా, వచ్చే ఉగాది, ఆ తర్వాత దసరాకు ఈ మొత్తాన్ని మూడు దఫాలుగా చెల్లించాలని నిర్ణయించినట్లు కెసిఆర్‌ చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించారు. కార్మికుల డిమాండ్లను సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్న కార్మికుల డిమాండ్‌కు సీఎం సానుకూలంగా స్పందించారు. ఒక శాతం ఎక్కువే ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. సీఎం ప్రకటనతో ఎనిమిది రోజులుగా కొనసాగుతోన్న సమ్మెకు నేటితో తెరపడింది. సీఎం ప్రకటనపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీఎంయూ, ఈయూ నేతలతో సీఎం సమావేశమై కార్మికుల సమస్యలపై చర్చించారు. వారి సమస్యలపై సీఎం కూలంకషంగా చర్చించి 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్‌ఇంన తరవాత సిఎం విూడియాతో మాట్లాడారు. ఆర్టీసిని రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే సమ్మెకాలానికి కూడా జీతాలు చెల్లిస్తామని, కేసులు ఎత్తేస్తామని, ప్రస్తుతం పనిచేస్తున్న 4300 కాంట్రాక్ట్‌ కార్మికులకు రేపటినుంచే రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించారు. వారికి కూడా జూన్‌ నుంచి ఫలిట్‌మెంట్‌ వర్తిస్తుందని అన్నారు.  ఇక బాండ్ల  కాల పరిమితి ఐదేళ్లు ఉంటుందని ఆయన అన్నారు. సమ్మె సమయంలో పెట్టిన కేసులను ఉపసంహరించుతామని కూడా ఆయన తెలిపారు. ఎపిలో 43 శాతం ప్రకటిస్తే, తెలంగాణలో 44 శాతం చేస్తున్నామన్నారు. ఆర్టిసి ల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్‌ చేస్తామని కూడా ప్రకటించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కనుక రిటైర్డ్‌ కార్మికులకు ఉచిత బస్‌ సదుపాయం కల్పిస్తామని ఆయన చెప్పారు. సంస్థలో పుట్టి దాని కోసం పనిచేసినందున వారికి హక్కు ఉందన్నారు. ఇక ఆర్టీసికి  ప్రభుత్వ బడ్జెట్‌ లోనే కేటాయింపులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్నగరంలో తిరిగే బస్‌ ల నష్టాన్ని భరించే విధంగా రాయల్టీ చెల్లించేలా చట్టంలో మార్పు చేస్తామని అన్నారు. ఇది రెండు వందల కోట్ల వరకు ఉంటుందని అన్నారు. అయితే అంతర్గత సామర్ద్యం పెరగాలని అన్నారు. ఆర్టిసి అప్పు కింద 186 కోట్ల వడ్డీ కట్టవలసి వస్తుందని, దానిని కూడా కట్టాలని ఆలోచిస్తున్నామని అన్నారు. ఆర్టిసి కార్మికులకు 44 శాతం ఫిట్‌ మెంట్‌ ఇస్తే 840 కోట్లు ఇవ్వవలసి ఉంటుందని, 1300 కోట్ల రూపాయల మేర బకాయిలు ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. గత ప్రభుత్వం  తెలివి తక్కువగా సంస్థను నడిపిందో ఆర్టీసిని చూస్తే తెలుస్తుందని అన్నారు. అర్బన్‌ రవాణాను స్థానిక సంస్థలకు అప్పగించాలని చూస్తున్నామని అన్నారు. ముంబై లో కూడా స్థానిక సంస్థే నిర్వహిస్తుందని అన్నారు. ప్రజా రవాణా అన్నది ప్రభుత్వాల సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడడమే టిఆర్‌ఎస్‌ విధానమని కెసిఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిని ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించామని అన్నారు. తెలంగాణలో ప్రతిరోజు 93 లక్షల మంది బస్‌ లలో ప్రయాణిస్తున్నారని కెసిఆర్‌ చెప్పారు. కొందరు కాంగ్రెస్‌ వారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. సంస్థను దివాళా తీయించిన వారే ఇవాళ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.  తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వ చర్చలు సఫలం కావడంతో ఎనిమిది రోజులుగా కొనసాగుతోన్న సమ్మె ముగిసింది. కార్మికులు అడిగిన ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన టీఎంయూ, ఈయూ నేతలు వారి సమస్యలను విన్నవించారు. వారి సమస్యలపై కూలంకషంగా చర్చించిన సీఎం 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.