ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల

` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్‌ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి
` ఆరు కోట్ల రివార్డు అందజేత
` ఆయనతో పాటు మరో 61 మంది సభ్యులు లొంగుబాటు
ముంబై(జనంసాక్షి): మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల మంగళవారం లొంగిపోయారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్‌ సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్‌ చేశారు. బుధవారం ఉదయం మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. ఇక, మల్లోజులపై దాదారు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో(ఆరు రాష్ట్రాల్లో కోటి చొప్పున) ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌.. రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో మోస్ట్‌వాంటెడ్‌గా మల్లోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ..’మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో మావోయిజానికి చోటులేదు. నక్సల్‌ ఫ్రీ భారత్‌ నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చారు.అయితే, మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.

 

ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట లొంగిపోనున్న ఆశన్న
` మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
` ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
చర్ల(జనంసాక్షి):మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ ఆయుధాలను వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఎదుట లొంగిపోయారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే మావోయిస్టు పార్టీకి మరో షాక్‌ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న.. దాదాపు 70 మంది సహచరులతో కలిసి గురువారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ ఎందుట లొంగిపోనున్నట్టు సమాచారం.ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్‌ (రామప్ప) మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామం. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్‌ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అప్పటి హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యనభ్యసించారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌కు(ఆర్‌ఎసయూ) నాయకత్వం వహిస్తూ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల నిరంతర ఆపరేషన్‌తో మావోయిస్టులు పెద్దఎత్తున లొంగిపోతున్నారు. సుక్మా జిల్లాలో బుధవారం ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ఎదుట 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు. మావోయిస్టు కంచుకోట బస్తర్‌లో సైతం గడ్చిరోలి తరహ భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ఉత్తర బస్తర్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జి రాజ్‌ మాన్‌ సహా పలువురు లొంగిపోనున్నట్లు సమాచారం. బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌, కాంకేర్‌ ఎస్పీ ఇంద్ర కళ్యాణ్‌ ఈ మేరకు మావోయిస్టులతో చర్చలు జరుపుతున్నారు.