ఇంటిదొంగల పనిపట్టాలి
కోవర్టులను ఏరిపారేయాలి
దేవీప్రసాద్ ఓటమికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న సగటు తెలంగాణవాది
హైదరాబాద్, ఏప్రిల్3(జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకలజనుల సమ్మె తదితర ఉద్యమ మైలురాళ్లపై తనదైన ముద్ర వేసిన నాయకుడు దేవీప్రసాద్. ఉద్యమం గమ్యాన్ని ముద్దాడిన నేపథ్యంలో ఇక ప్రజాసేవకు సిద్ధమంటూ ఉద్యమపార్టీ తరపున ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు. అంతా దేవీప్రసాద్ గెలుపు ఖాయమని భావించారు. కానీ చాపకింద నీరులా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు దక్కించుకున్నారు. ఊహకందని ఈ ఫలితం యావన్మంది తెలంగాణ వాదులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఫలితాలు తారుమారు కావడానికి కొంత మంది స్వపక్ష నేతలు హ్యాండివ్వటమే కారణం అంటూ కొత్త వాదన తెరపైకొచ్చింది. ఇటీవలే కంటోన్మెంట్ ఎన్మికల్లో ఉద్యమపార్టీకి మెజారిటీ కట్టబెట్టిన జంటనగరవాసులు ఇంతలోనే దేవీప్రసాద్ లాంటి కీలక నేతను తిరస్కరించారంటే నమ్మశక్యంకాదు. పోనీ ఇది ప్రభుత్వంపట్ల ప్రజావ్యతిరేకత అందామంటే ఇదే సమయంలో జరిగిన మరో ఎన్నికలో అధికారపార్టీ టీయారెస్కు చెందిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో ప్రభుత్వ వ్యతిరేకత లేదని స్పష్టమవుతోంది. దీన్ని బట్టే దేవీప్రసాద్ ఓటమికి కారణాలు వేరే ఉన్నాయని స్పష్టమవుతోంది. దీనిపై మంత్రి నాయిని లాంటి వారు బహిరంగంగానే ఎవరో మాకు హ్యాండిచ్చారని ప్రకచించటంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే దేవీప్రసాద్ ఓటమికి కంకణం కట్టుకున్నారని, బహిరంగంగానే దేవీప్రసాద్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఇంటిదొంగలను తరిమికొట్టి పార్టీకి చేటుచేస్తున్న కోవర్టులను తరిమికొట్టి తెలంగాణవాదుల మనోభావాలకనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం దేవీప్రసాద్ ఓటమిపై తగు విచారణ జరిపించాల్సిన అవసరముంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే 12 వేల ఓట్ల భారీ నష్టంతో టీఆరెస్ తరపున బరులో నిలిచిన ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓటమి పాలయ్యారు. దేవీప్రసాద్ ఓటమికి కారణాలేమైనా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కావటంలో తనదైన పాత్ర పోషించిన దేవీప్రసాద్ ఓటమిని సగటు తెలంగాణవాది జీర్ణించుకోలేకపోతున్నడు. తెలంగాణవాదులంతా దేవీప్రసాద్ ఓటమిపై ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నరు. మహాకవి కాళోజీ ప్రాంతేతరులు, ప్రాంతవాసులను పోలుస్తూ రాసిన కవిత ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నరు.
ప్రతిపక్షాలన్నీ ఏకమై దేవీప్రసాద్ ఓటమి కోసం అహోరాత్రులు శ్రమించినా దేవీప్రసాద్ దెలుపును ఆపలేరని ధీమాతో ఉన్న అధికారపార్టీ అగ్రనేతలను ఫలితం ఖంగు తినిపించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డిల్లో సెటిలైన సీమాంధ్రుల ప్రభావం దేవీప్రసాద్పై స్పష్టంగా పడినా ఓటమి దరిచేరదని భావించినా. సీమాంధ్ర సెటిలర్ల ఓట్లన్నీ బీజేపీకి పోలవడం, అదే సమయంలో సొంతపార్టీ నుంచి ఓట్లు చాలావరకు బీజేపీకి మళ్లడం అనుమానాలకు తావిస్తోంది. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం దేవీప్రసాద్కు అనుకూలంగా రావాల్సిందిపోయి మరో పార్టీకి ఆ స్థానం దక్కడం సగటు తెలంగాణ వాది జీర్ణించుకోలేకపోతున్నడు. పోలైన ఓట్ల శాతం సగానికి తక్కువ ఉండగా వాటిలో ఒక జూబ్లీహిల్స్ లాంటి సీమాంధ్ర సెటిలర్ల అడ్డాలో 50 శాతానికిపైగా ఓట్లు నమోదు కావడం ఎమ్మెల్సీ ఎన్నికలను సెటిలర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అయినా ఈ ప్రభావం దేవీప్రసాద్ గెలుపుపై పడదనే అంతా భావించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. గెలుపుపై అతివిశ్వాసమే కొంప ముంచింది. తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల ప్రభావం కొంతవరకు పడింది. అయితే అన్నింటికంటే మిన్నగా సొంతం అనుకున్నవారే వెన్నుపోటు పొడవటంతోనే దేవీప్రసాద్ ఓటమిపాలయ్యారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రకంగా ఉద్యమకెరటం దేవీప్రసాద్ ఓటమికి రకరకాల కారణాలు దోహదంచేశాయి.
అంతేకాక పోలైన ఓట్ల శాతం తక్కువుండటంతోపాటు పోలైన ఓట్లలో దాదాపు 10వేల పైచిలుకు ఓట్లు మురిగిపోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా దేవీప్రసాద్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కానీ అధికారపార్టీని ఓడించటానికి విపక్షాలన్నీ ఏకంకావడంతో దేవీప్రసాద్కు ఎదురుగాలి వీచింది. దీనికి స్వపక్షానికి చెందిన కొంతమంది తోడయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ బరిలో లేనట్లుగానే వ్యవహరించడం, సీమాంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ మద్దతుదారులైన వాళ్లంతా బీజేపీకి ఓటేయడం భాజపాకు కలిసొచ్చింది.
ఏదేమైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబుబ్నగర్ నుంచి బీజేపీ గెలుపొందిన తీరు నుంచి అధికార టీయారెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని, తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సీమాంధ్ర సెటిలర్లపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. కుక్కతోక సక్కగ కాదన్నట్టు ప్రాంతేతరుల బుద్ధి మారదుగాక మారదు. వాళ్ల కాలి ముల్లు మన పంటితో తీసినా, ఇక్కడోళ్లంత తెలంగానోళ్లేనని గొంతు చించుకున్నా ఈ మట్టిపుత్రులను దూరం చేసుకోవడానికి తప్ప మరో ప్రయోజనం ఆశించడం అత్యాశే అవుతుంది. దేవీప్రసాద్ తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన పాత్ర అచంచలమైనది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా జరిగిన ఎన్నో పోరాట రూపాల్లో ప్రదానంగా చెప్పుకోదగింది సకలజనుల సమ్మె. టీఎన్జీఓస్ అధ్యక్షుడిగా ఉద్యోగ సంఘాల తరపున జేఏసీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ దేవీప్రసాద్ మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధనలో పాలుపంచుకున్నారు. 45రోజులకుపైగా సాగిన సకలజనులసమ్మెలో ఉద్యోగులంతా బెదిరింపులకు లొంగకుండా, జీతాలు నిలిపేసినా, అదరక బెదరక ఉద్యమానికి దన్నుగా నిలబడేలా చేయగలగటంలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంతోనూ సంయమనంతో శాంతియుతంగా ఆంధ్ర ఉద్యోగులతో విభేదిస్తూనే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లటంలో కీలకపాత్ర పోషించారు దేవీప్రసాద్. ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పుకోదగ్గ పరిణామాల్లో కీలకమైన అంశం ఇక్కడ సెటిలైన ఆంధ్ర ఉద్యోగులపై ఎలాంటి దాడులు జరగకుండా విశిష్ట నాయకత్వం వహించిన ఘనత దేవీప్రసాద్కే సొంతం.
దేవీప్రసాద్ది ఆదినుంచే వినూత్న ఒరవడి. ఉద్యోగ సంఘాల నేతగా పలు సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేశారు. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించటంలో దేవీప్రసాద్ది కీలకపాత్ర. సమస్యల పట్ల అవగాహన, పరిష్కారానికి చిత్తశుద్ధి ఉన్న దేవీప్రసాద్ లాంటి వారు సభలో ఉంటే సభకే తరగని వన్నె వస్తుందనటంలో సందేహం లేదు. కానీ తెలంగాణవాదుల ఆకాంక్షలు సెటిలర్ల కుట్రల ముందు చిన్నబోయినయని తెలంగాణ వాదులంటున్నరు. సౌమ్యుడు, గుణవంతుడు, మేధావి దేవీప్రసాద్ లాంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి నేతను ఓడించేందుకు కంకణం కట్టుకున్న ఇంటిదొంగల పనిపట్టాలి. తెలంగాణ అనే మాటకోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్న మట్టి పుత్రుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తున్న కోవర్టులను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలి. బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం గమ్యాన్ని ముద్దాడటానికి దేవీప్రసాద్కు తిరిగి మరో మంచి అవకాశమిచ్చి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధినేత కేసీఆర్ పై ఉంది.