ఉద్యమ జర్నలిస్టులు ముందుండి నడవండి

మీ వెంట మేముంటాం.. ఎందాకైనా పోరాడుతాం
ఉద్యమ పాత్రికేయుల పాత్రను చరిత్రలో లిఖించాలి
సాధించుకున్న విషయాలను సమగ్రంగా రికార్డు చేయాలి
గత అనుభవాలను, ఎదుర్కొన్న సవాళ్లపైనా చర్చ అవసరం
ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ సమావేశంలో వక్తల అభిభాషణ
బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వేదికగా చరిత్రాత్మక సమాలోచనలకు శ్రీకారం
హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి, డిసెంబర్‌ 21 (జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల కోసం దశాబ్దకాలం తర్వాత ఓ వేదిక రూపొందడం చారిత్రక సన్నివేశమని, ఈ సందర్భం తెలంగాణ స్ఫూర్తిని చాటడంతో పాటు భవిష్యత్‌ తరాలకు ఓ దిక్సూచిగా మారాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. ఉద్యమ జర్నలిస్టుల పాత్రను చరిత్రలో నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యమ అనుభవాలు, రాష్ట్రం సాధించుకున్న విషయాలపై సమగ్ర చర్చ జరగాలని, అందుకు జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని అభిలాషించారు. తెలంగాణ ఉద్యమ సాధనలో ఎన్నోవిధాలుగా సమస్యలు ఎదుర్కొన్న జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ‘తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ సమావేశం’ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి జర్నలిస్టులు తరలిరాగా.. అందెశ్రీ విరచిత ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు.
జనంసాక్షి ఎడిటర్‌ ఎంఎం రహమాన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా పూర్వ లోకాయుక్త, సుప్రీం కోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్‌) జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె శ్రీనివాస్‌, సింగరేణి సకలజనుల సమ్మె కన్వీనర్‌ ఎండి మునీర్‌ హాజరయ్యారు.
జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టుల్లో అనేకమంది చేదు అనుభవాలు చవిచూశారనీ, ఈ విషయం జర్నలిస్టు రఫీ కన్నీళ్లలో కనబడిందన్నారు. అవి వ్యక్తిగత అనుభవాల నుంచి వచ్చిన కన్నీళ్లు కాదని, ఆ కన్నీళ్ల వెనుక తెలంగాణ ప్రజల బాధలు, కష్టాలు ఉన్నాయన్నారు. ఆ చేదు అనుభవాలే మనల్ని తడుముతున్నాయన్నారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక్కో గాథ ఉందన్నారు. ఎవ్వరైనా తమ స్వేచ్ఛను వేరే ఎవరికీ సమర్పించకూడదని,  అలా సమర్పిస్తే అది నిరంకుశానికి దారి తీస్తుందని హెచ్చరించారు. డిపిప్లేన్డ్‌ పొలిటికల్‌ పార్టీ పేరిట మంత్రులను సైతం బొమ్మలుగా మార్చేశారని విమర్శించారు. పాలకుల నుంచి ప్రజలు కాస్త సంస్కారం, మరికాస్త నమత్ర కావాలని కోరుకున్నారు కాబట్టే ప్రభుత్వాన్ని మార్చేశారని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన రోజే తెలంగాణ ప్రజల మీదినుంచి బరువు దిగిపోయిందని కోదండరాం అనడం గత పాలనకు అద్దం పడుతోందన్నారు. స్వేచ్ఛకు ఉండే ప్రాముఖ్యతను గుర్తించినందుకే జర్నలిస్టులంతా ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారని, ఈ వేదికను మరింత బలోపేతం చేసుకుని కమిటీని రూపొందించుకొని, ముందడుగు వేయాలని సూచించారు. జర్నలిజంలో, వివిధ సంఘాల్లో ఉన్నవాళ్లందరినీ ఏకతాటిపైకి తేవాలన్నారు. ప్రతిసారీ గత 70ఏళ్ల చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదని, 2014 తర్వాత జరిగినదే చర్చలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ పదేళ్లలో ఎవరు బాగుపడ్డారు? ఎవరి కడుపులు నిండాయో గుర్తించాలన్నారు. ఈ అంశాన్ని చరిత్రగా రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులకు నివాసమే కాదు, ఎలాంటి భద్రతా లేదన్నారు. మనుగడ ఎలా సాగించాలన్న సవాల్‌ను అధిగమించేందుకు జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యాచరణలో జర్నలిస్టుల వెంట తాముంటామని, ఎంతవరైనా పోరాడుతామని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. ఈ సమావేశాన్ని చూస్తే నిరంకుశత్వం ఇంతమందిని ఎన్ని రూపాల్లో బాధించిందో అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. ఈ నిరంకుశత్వాన్ని పోగొట్టడం కోసం కీలకమైన పోరాటం ఇప్పుడే మొదలైందన్నారు. సమిష్టి వనరులను ఎవరు కొల్లగొట్టారో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను అధిగమించడానికి ఉండే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ జరగాలని సూచించారు. ఇప్పటివరకు సర్కారు వద్దకు వెళ్లిన ఫైళ్లకు సరైన పరిష్కారం లేదని, వాటిగురించి అడిగే ధైర్యమూ ఎవరికీ లేకపోయిందని చెప్పారు. ఇన్నిరకాల నియంతృత్వాన్ని ఎదుర్కొన్న జర్నలిస్టుల అనుభవాలను, తెలంగాణ పోరాటంలో వారి పాత్రను గ్రంథస్థం చేయాలని, ఒక వ్యక్తి ఆధిపత్యానికి దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేయాలని చెప్పారు. స్వేచ్ఛను ఆస్వాదించాలి.. అణిచివేతను అధ్యయనం చేయాలన్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత వాట్సాప్‌ కాల్స్ ను ఆపేశామని ఆనందంగా చెప్పడం ప్రజల్లో కనిపిస్తున్న రిలీఫ్ కు సంకేతంగా అభివర్ణించారు. ముళ్లకంచెలు తొలగించినప్పుడు బెర్లిన్‌ గోడను కూలగొట్టినంత ఆనందం కలిగిందన్నారు. ఆలోచిస్తే ఇలాంటివెన్నో తారసపడతాయన్నారు. ఈ కొత్త వేదిక కోసం ఒక ప్రత్యేక కమిటీ వేసుకోవాలని, సమన్వయంతో సాగాలని సూచించారు. ఇప్పటి తెలంగాణ పునర్నిర్మాణంలో జర్నలిస్టులు పాత్రధారులు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సాధించిన విషయాల్ని రికార్డు చేయడంతో పాటు అన్నిటిపైనా చర్చ చేయాలని సూచించారు. జర్నలిస్టులు కీలక బాధ్యతలు నిర్వర్తించాలి.. యూనియన్ల పనితీరును వెలుగులోకి తేవాలన్నారు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కోసం వేదిక అవసరం ఉందని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. గతంలో అనేక సందర్భాల్లో, అనేక వేదికలపై సీఎం కేసీఆర్‌ తన అహంకారాన్ని ప్రదర్శించినా ఏ జర్నలిస్టూ నిరసన తెలిపిన పాపాన పోలేదన్నారు. జర్నలిస్టుల్లో ఉద్యమ స్ఫూర్తి కొరవడిందని ఇలాంటి ఉదంతాలు గుర్తుచేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ఉద్యమ జర్నలిస్టుల పాత్ర ఎలాంటిదో నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదివరకు కొంత జరిగినా సమగ్రత రాలేదన్నారు. దేశ ఉనికి కోసం చరిత్ర రాసుకున్నాం కానీ, తెలంగాణ విషయంలో ఇప్పటివరకు చరిత్ర రచన జరగకపోవడం బాధాకరమని, ఇకనైనా మొదలుకావాలని ఆకాంక్షించారు. నిర్బంధం మీద డాక్యుమెంటరీ తీసుకురావాలని కోరారు. ఈ కార్యాచరణలో భాగస్వామ్యం చేయడం తన అదృష్టమన్నారు.
అనంతరం తాటికొండ రమేష్‌ బాబు పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా.. జర్నలిస్టులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణలో భాగంగా తాతాల్కిక కన్వీనర్‌గా ఎంఎం రహమాన్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వీక్షణం ఎడిటర్‌ ఎన్‌ వేణుగోపాల్‌, కందుకూరి రమేష్‌ బాబు, సీనియర్‌ రిపోర్టర్‌ మల్లయ్య గౌడ్‌, సుదర్శన్‌, పీఎస్‌ రవీంద్ర, రఫీ, పసునూరి రవీందర్‌, ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.