బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌

ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా
కేసీఆర్‌కు లేఖలు పంపిన గువ్వల బాలరాజు, అబ్రహం, మర్రి జనార్ధన్‌ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 04 (జనంసాక్షి) : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ పార్టీలో మరో అలజడి రేగింది. తాజాగా ముగ్గురు కీలక మాజీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ముగ్గురిలో గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్‌ రెడ్డి, అబ్రహం ఉండగా.. వారు తమ రాజీనామా లేఖలను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఈ పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో తీవ్ర అలజడి నెలకొంది.నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఆయన అధికారికంగా కమలం పార్టీలో చేరే అవకాశముంది. ఇటీవల ఓ పార్టీ కార్యకర్తతో గువ్వల బాలరాజు చేసిన ఫోన్‌ కాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ ఫోన్‌ సంభాషణలో, బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన అభ్యర్థిత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. గతంలో తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, ఇప్పుడు తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ వైపు అడుగులు వేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. తనను పక్కనపెట్టి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ టికెట్‌ను ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు ఇవ్వడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఆలంపూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన, ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని వెల్లడిరచారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరతానన్న విషయంపై తాను త్వరలో క్లారిటీ ఇస్తానని చెప్పారు. అయితే, ఆయన కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.