ఎంపిటిసి,జడ్పీటీసిల ఎన్నికలపై వాదనలు పూర్తి

అమరావతి,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2021 జనవరి 8 నుంచి మార్చి 10 వరకు సుప్రీంకోర్టు చెప్పిన 4 వారాల స్థానిక ఎన్నికల నియమావళి పూర్తయింది నిరంజన్‌ రెడ్డి కోర్టుకు తెలిపారు. డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల మేరకే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపుపై స్టే ఇవ్వడం సరికాదన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు 4 వారాల కోడ్‌ అమలు చేయలేదని నిరంజన్‌ రెడ్డి గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు 22 రోజులు మాత్రమే కోడ్‌ అమలు చేశారన్నారు. 4 వారాల కోడ్‌ కావాలని ఏ ఒక్క పార్టీ కూడా ఎస్‌ఈసీని అడగలేదని, ఈ కోడ్‌పై ఏ ఒక్కరు కోర్టుకు ఫిర్యాదు చేయలేదని లాయర్‌ నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కాగా, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలతో ఏప్రిల్‌
8న జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి.