ఓర్వలేక రెచ్చగొడుతున్నారు

– పాలమూరుకు నీళ్లించింది ముమ్మాటికీ తెరాస ప్రభుత్వమే
– గట్టు ఎత్తిపోతలకు సంబంధించిన ఒక్క జీవోనైనా చూపగలరా?
– డీకె అరుణ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌
మహబూబ్‌నగర్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : వాస్తవాలు మాట్లాడితే ఓర్వలేకనే ఎమ్మెల్యే డి.కె. అరుణ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… పాలమూరుకు నీళ్లిచ్చింది ముమ్మాటికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ హాయంలో కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాంసులు తప్ప ప్రాజెక్టుల కింద నీరిచ్చింది లేదని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వారి చూపంతా కూడా రాయలసీమ, ఆంధ్రా వైపే ఉండేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఎంతో చిత్తశుద్ధితో భూసేకరణ జరిపి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాయలసీమకు కృష్ణా నీళ్లు మళ్లించేందుకు మంగళ హారతులు పట్టింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. గట్టు ఎత్తిపోతల పథకం తమదే అంటున్న కాంగ్రెస్‌ నేతలు అందుకు సంబంధించి ఒక్క జీవోనైనా చూపగలరా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓ పదిమంది కాంగ్రెస్‌ నేతలకు మాత్రం ఎక్కడా లేని దుఃఖం వస్తోందని వివరించారు. డీకే అరుణకు పాలమూరు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు.  ఇప్పటికైన అనవసరమైన వ్యాఖ్యలు మాని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని సూచించారు.