కాంగ్రెస్‌ బస్సు యాత్రకు నిరసనల సెగ

ఉప్పునూతల: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి డి.కె. అరుణ నేతృత్వంలో నిర్వహిస్తున్న బస్సుయాత్రకు సోమవారం మండలంలోని వెల్టూరు. కొరటికల్‌ గ్రామాల్లో తెలంగాణ నినాదాలతో యువకులు నినాదాలు చేశారు. మహిళలు ఖాళీ బిందెలతో తాగునీటి సమస్యపై ఏకరువు పెట్టారు. నీటి ఎద్దడితో అల్లాడుతున్నామని ఆయా గ్రామాల్లో వారు మంత్రి ముందు గోడును వెళ్లబోసుకున్నారు. తెలంగాణ నినాదాలు చేస్తున్న యువకులను, మహిళలను పోలీసులు అక్కడి నుంచి తప్పించారు. ఒక్కో గ్రామంలో 15నిమిషాలకు మించి ఉండకుండా యాత్రను ముగించారు. ఈ బస్సుయాత్రలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు డీసీసీ అధ్యక్షులు ఒబదుల్లా కొత్వాల్‌, మాజీ ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యులు జగదీశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రామ్మోహనరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.