క్రిఫ్టో కరెన్సీ పేరుతో 25 లక్షలకు మోసం

హైదరాబాద్‌,మార్చి9(జనం సాక్షి): అధిక లాభాలు వస్తాయంటూ ఇద్దరు వ్యక్తులు నమ్మించి క్రిఫ్టోకరెన్సీ లో పెట్టించిన రూ.25 లక్షలు నష్టపోయానంటూ ఓ బాధితుడు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సనత్‌నగర్‌లోని శివాజీనగర్‌లో నివాసముంటున్న శర్మ తన ఇంటి పైఅంతస్తులో అద్దెకుంటున్న
మల్లికార్జున్‌, మణికంఠలు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో శర్మ రూ.25లక్షలు పెట్టుబడిపెట్టాడు. లాభాలు రాకపోగా మొత్తం డబ్బు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనతో పెట్టుబడి పెట్టించిన వారిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ ముత్తు యాదవ్‌ తెలిపారు.