ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం

మేయర్‌ కారును అడ్డుకున్న కార్మికులు
ఖమ్మం,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  ఖమ్మం పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం రీజియన్‌ డిపో ఆర్టీసీ కార్మికులు.. మేయర్‌ పాపాలాల్‌ కారును అడ్డుకొని.. ఆందోళనకు దిగారు. మేయర్‌ కారు ముందుకుపోకుండా కార్మికులు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో మేయర్‌ కారు…ఆర్టీసీ కార్మిక నేత పాదంపైనుంచి వెళ్లడం.. కార్మికులకు ఆగ్రహం తెప్పించిందీ. దీంతో కారుకు అడ్డంగా ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తప్పించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి రోజు 9 డిపోల పరిధిలోని 880 బస్సులను పోలీసుల పహారా మధ్య నడిపించారు. ఆర్టీసీ బస్టాండ్‌, డిపోల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంది. తెలంగాణలో మూడోరోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు, ఉద్యోగులు ఇంకా విధుల్లో చేరలేదు. మరోవైపు ఉద్యోగాల కోసం డిపోల వద్ద నిరుద్యోగులు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తనివ్వబోమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది.