చాపకిందనీరులా బ్లాక్‌ ఫంగస్‌

ఆందోళనలో జిల్లా ప్రజలు
గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఒకవైపు కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతుండగా.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. దీంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడినట్లు సమాచారం. అయితే దీనికి మందులు అందుబాటులో లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారికి ప్రజలు భయభ్రాంతులకు గురౌతుంటే.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన బ్లాక్‌ ఫంగస్‌ కేసులతో అంతటా భయం నెలకొంది. సరైన వైద్యం అందకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్‌ ఫంగస్‌కు వైద్యం చేస్తున్నామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోగులకు మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.