టిడిపి హయాంలో నేత కార్మికులకు అండ

త్రిఫ్ట్‌ సాయం 16శాతానికి పెంచాం
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బాబు
అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): టిడిపి హయాంలో చేనేత కార్మికులకు అండగా నిలిచామని మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక రకాలుగా వారికి సాయం అందించామన్నారు.
పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత తెలుగుదేశం పాలనలో నేతన్నలకిచ్చే త్రిఫ్టును 8 నుంచి 16శాతానికి పెంచామన్నారు. నూలుపై సబ్సిడీని 10 నుంచి 40శాతానికి పెంచామన్నారు. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాల రాయితీని అమలు చేశామని చంద్రబాబు వెల్లడిరచారు. పనులు లేని వర్షాకాలానికి భృతి అందించా మన్నారు. 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చామని… ఆదరణతో పనిముట్లు అందజేసి అండగా నిలిచామన్నారు. తెలుగుదేశం హయాంలో నాటి పరిస్థితుల్ని, వైసీపీ ప్రభుత్వంలో నేతన్నల నేటి దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోందన్నారు. ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.50వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి రూ.24 వేలతో సర్దుకోమంటూ తీరని ద్రోహం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. నేతన్నల అభివృద్ధి, అభ్యున్నతిని ఈ ప్రభుత్వం ప్రశ్నార్ధకం చేస్తోందన్నారు. నాడు చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దు చేసి చీకట్లలోకి నెట్టేశారన్నారు. తెలుగుదేశం హయాంలో అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలు నేతన్నలకు ఇవ్వాలన్నారు. అలాగే కరోనాతో నష్టపోయిన కార్మికులకు పరిహారం కూడా అందజేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.