తెలంగాణపై రాజీలేని పోరు

తెలంగాణ వద్దనే నేతల్ని తుంగలో తొక్కి
ప్రజలు తెలంగాణ సాధించుకుంటారు : నారాయణ
సూర్యాపేట, ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ పటిష్టంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారంనాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడం వల్ల సిపిఐ బలహీనపడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, వాటిలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ బలంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ప్రజలే నేతలకు అడ్డుపడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ సమస్యపైనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేస్తామని నారాయణ తెలిపారు. విభజన అంటూ జరిగితే విడిపోయి కలిసి ఉండడం మంచిదని అన్నారు. విభజనపై ఎవరి అభిప్రాయాలు వారివన్నారు. ఏ విషయంపైనైనా చర్చించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. విభజన అంటూ జరిగితే రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరడం న్యాయసమ్మతమేనన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎవరి దేనికోసమైనా పోరాడొచ్చని సూచించారు.