తెలంగాణ ఇవ్వకపోతే పుట్టగతులుండవ్‌

యూపీఏ బేటీలో చర్చ
న్యూఢిల్లీ,ఆగస్టు 23(జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై నిర్ణయానికి కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతూండగా, ఈ అంశం బుధవారం రాత్రి జరిగిన యుపిఎ సమస్వయ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సమస్యపై త్వరగా ఒక తీర్మానం చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది.ఈ సమావేశానికి హాజరైన కంగ్రెసేతర యుపిఎ నాయకుడొకరు ఆ వివరాల్ని గురువారం వెల్లడిస్తూ, ఈ సమస్యపై వీలైనంత త్వరగా ఒక నీర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుందని, లేకుంటే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి, దాని మిత్రపక్షాలకు నష్టం కలుగుతుందని అన్నారు. 2009లో 33మంది ఎంపిలను కాంగ్రెస్‌ తరఫున కేంద్రానికి పంపిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత దాదాపు అన్ని ఉపెన్నికల్లో దెబ్బతింది.తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో చేస్తున్న జాప్యం కారణంగా, కాంగ్రెస్‌ సింతంగా అధికారంలోవున్నవాటిలో ఏకైక పెద్దరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2004, 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన మంచి ఫలితాల కారణంగా ఆ రెండు సందర్భాల్లో కాంగ్రెస్‌ నాయకత్వంలో యుపిఎ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైంది.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకోసం ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు 2009 డిసెంబరు
తొమ్మిదిన ప్రకటన చేసిన కేంద్రం పదిహేను రోజుల అనంతరం ఆ నిర్ణయంనుంచి వెనక్కి మళ్ళింది. ఈ అంశంపై మరిన్ని సంప్రదింపులు అవసరమని పేర్కొంది.అప్పటి నుంచి కాంగ్రెస్‌ను ఈ సమస్య కుదిపేస్తోంది. ఈ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వివిధ మార్గాలను అన్వేషిస్తోంది.కాగా, జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా ఈ అనిశ్చితిని తొలగించలేకపోయింది. గత ఏడారిన్నరగా ఆ నివేదికపై నిర్ణయం పెండింగ్‌లో వుంది. ఇంకా మభ్య పెట్టాలని చూస్తే ప్రజల్లో అసహనం పెల్లుభికే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లుగా సమాచారం.