మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం
` ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్లో మాత్రం స్థిరత్వం
` వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్ (జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ రాజకీయ స్థిరత్వం, సుస్థిరతతో ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తుందని వెల్లడిరచారు. ప్రస్తుత సమయంలో మౌలిక సదుపాయాలతో పాటు, పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న కార్మిక శక్తి అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం గుజరాత్ కఛ్లో ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.’’ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం భారత ప్రగతిపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు పెట్టుకున్నాయని స్పష్టమవుతోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. పాల ఉత్పత్తిలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. జనరిక్ మందుల ఉత్పత్తిలో నంబర్ వన్గా ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్ . గత 11 ఏళ్లుగా భారత వృద్ధి గణాంకాలు ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా వినియోగదారు భారత్. మన యూపీఐ ప్రపంచంలోనే రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో మొదటిగా రికార్డ్ సాధించింది. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్, మూడో అతిపెద్ద పౌరవిమానయాన మార్కెట్గా ఉందన్నారు.అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో సంస్కరణలే కీలక పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ నిపుణులు, సంస్థలు భారత్? ప్రగతి పథంలో పయనిస్తోందని చెబుతున్నారు. భారత్ను ఐఎంఎఫ్ ప్రపంచ వృద్ధికి ఇంజిన్గా అభివర్ణించింది. భారత రేటింగ్స్ను 18 ఏళ్ల తర్వాత ఎస్అండ్ పీ సవరించింది. ఫిచ్ రేటింగ్స్ కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని అభినందించింది. మౌలిక సదుపాయాలతో పాటు కార్మిక శక్తి కూడా అవసరం ఉంది.’’ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి ఊతం ఇవ్వడానికి సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారుతున్నాయని మోదీ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడంలో సౌరాష్ట్ర, కచ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించే మార్కెట్ ఆధారిత ప్రక్రియ అని అభివర్ణించారు. ఇక్కడి వివిధ పారిశ్రామిక క్లస్టర్లలో, స్క్రూడ్రైవర్ల నుంచి ఆటో విడిభాగాలు, యంత్ర పరికరాలు, లగ్జరీ కార్ లైనర్లు, విమానాల విడిభాగాలు, యుద్ధ విమానాలు, రాకెట్ల వరకు ప్రతిదీ రాజ్కోట్లో తయారు చేస్తున్నారని మోదీ తెలిపారు.అదేవిధంగా సవాలు ఎంత పెద్దదైనా కృషి, పట్టుదల , నిజాయతీతో ముందుకు సాగితే విజయం అనివార్యమని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు మనకు నేర్పుతున్నాయని మోదీ అన్నారు. ఒకప్పుటి తాగునీటి, విద్యుత్ సమస్యలను సౌరాష్ట్ర, కచ్ ప్రజలు తమ కృషితో మార్చుకున్నారని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాంతాలు నేడు ఎన్నో అవకాశాలను సృష్టిస్తున్నాయని, అదేవిధంగా భారతదేశ వృద్ధికి అవి ఒక లంగరు ప్రాంతంగా మారాయని అభివర్ణించారు.అదే విధంగా గ్రీన్ డెవలప్మెంట్, గ్రీన్ మొబిలిటీ, ఇంధన భద్రతకు సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు ప్రధాన కేంద్రంగా మారుతున్నాయి. కచ్లో 30 గిగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన పార్క్ నిర్మిస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్క్ అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. కచ్, జామ్నగర్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని, కచ్లో భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారని మోదీ అన్నారు.

