ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ

 

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అర్రివ్ ఎలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారం గ్రామంలో మంగళవారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా, జనవరి 13 నుండి 24 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లబుద్ధారం గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, అనుమతించిన వేగం పరిమితిని మించకుండా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి, ప్రమాదాల కారణంగా వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనలు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం తీసుకువచ్చేలా ఉపయోగపడ్డాయని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను జీవితాంతం బాధలోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్నదే అర్రివ్ ఎలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి రవాణాశాఖ అధికారి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.