తెలంగాణ నేల పులకరిస్తున్న వేళ!

నేలమ్మ..నేలమ్మా అంటూ పులకరించిన తెలంగాణ ఆవిర్భావ శుభఘడియలివి. ఎన్నో ఏళ్ల పోరాటం.. మరెన్నో గాయాలు..మరెన్నో ఆత్మహత్యలు..చివరకు రెండేళ్ల క్రితం ఉద్యమ సారథి కెసిఆర్‌ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం.. అప్పుడే రెండేళ్ల అనుభవం ఈ నేల కొత్త దారులను చూపింది. నడకలు నేర్చి వడివడిగా అడుగులు వేస్తోంది. అవి అభివృద్ది వైపుగా సాగుతున్నాయి. తడబాటు ఎక్కడా కనిపించడం లేదు. అడుగుల ఎటు వేయాలో ఎటు వేయకూడదో అన్న అనుభవం తెలంగాణ సొంతం. అందుకే గతానుభవ పాఠాలతో అభివృద్ది అడుగులు పడుతున్న వేళ.. ద్వి..గ్విజయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటాం. ఈ నేల పులకరించాలి..కోటి ఎకరాల మాగాణా కావాలి. ఇంటింటికీ నీరు చేరి ప్రతి గొంతూ తడవాలి. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేలా ఇల్లు ఉండాలి. స్విచ్‌ వేస్తే కరెంట్‌ వెలగాలి…ఊరు పక్కకెళితే చెరువుల్లో నీటి సవ్వడి వినపడాలి. కప్పల బెక్కబెకలు మన కర్ణాలను తాకాలి. ఇంత గొప్ప అనుభవం ఓ 40 ఏళ్లక్రితం మాత్రమే చూసి ఉంటాం. పచ్చనిచెట్లతో సెలయేళ్లతో ఉన్న ఊర్లను ఈ తరం చూసి ఉండదు. అందుకే గత వైభవం కావాలని కోరుకుంటాం. ఇందుకోసం పులకించి మది అంటూఉంటుందా..ఈ అనుభవం ఇక కలకాదు..అవును నిజం అన్నట్లుగా తెలంగాణ నేలపై అభివృద్ది పనులు పరగుగుల పెడుతున్నాయి. దశాబ్దాల సమైక్య సంకెళ్లు తెంచుకొని దేశ యవనికపై కొంగొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, జూన్‌ 2తో రెండు వసంతాలు పూర్తి చేసుకుని సగర్వంగా తలెత్తుకుంది. ప్రపంచంలో ఓ రాష్ట్రం ఇంత త్వరగా కోలుకుని నిలబడడమే గొప్ప అనుభవంగా చూడాలి. నాయకుడు సరైన వాడయితే రాష్ట్రం బాగుపడుతుందన్నది కెసిఆర్‌ నిరూపిస్తున్నారు. ప్రత్యేక సమరాన సర్వం తానై, తన దీక్షాదక్షతలతో స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్‌, అనంతర ఎన్నికల్లో నిలిచి, గెలిచి, ప్రభుత్వ తొలి సారథిగా పగ్గాలు చేపట్టి రెండేళ్లవుతున్నది. అధికారంలో ఉన్నా లేకరున్నా ఆయన ఉద్యమ పంథా తెలంగాణకు శ్రీరామరక్షగా నిలిచింది. అలసిపోని పోరాట యోధుడు కావడం వల్ల అధికారంలో ఉన్న ఈ రెండేళ్లలో ఎంతో అనుభవాన్ని రంగరించి పాలన చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఎందుకు? అంటూ నాడు వెటకారంగా ప్రశ్నించినవారందరికీ సమాధానంగా ఈ స్వల్ప కాలంలోనే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు.. అనే ఉద్యమ లక్ష్యానికి అనుగుణంగా టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజారంజక పాలన సాగిస్తున్నది.  బంగారు తెలంగాణ సాధనే  ధ్యేయంగా కనీవినీ ఎరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో నాటి సీమాంధ్ర పాలనకూ, నేటి స్వపరిపాలనకూ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇన్నాళ్లూ మనం ఏం కోల్పోయామో కళ్లకు కట్టేలా చేస్తున్నారు. నదీ జలాలతో తెలంగాణ నేల పులకించే బృహత్తర ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ప్రతిష్ఠాత్మక అంత్రరాష్ట్ర ప్రాజెక్టు లోయర్‌పెన్‌ గంగ, మరో మూడు బ్యారేజీలు, ప్రాణహిత సహా, కాళేశ్వరం, పాలమూరు,రంగారెడ్డి వంటి  పలు కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కడమేగాక పాతవి పరుగందుకోవడం శుభపరిణామంగా కనిపిస్తున్నది. అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే రెండేళ్లలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కానుంది. సమైక్య పాలనలో దశాబ్దాల జలవివక్షకు చరమగీతం పాడుతూ, హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు ముందుకు కదులుతున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు, సకల జన జల ఆశలు, ఆశయాలకనుగుణంగా జలాశయాలను సాకారం చేసే దిశగా కదులుతున్నది. ఈ క్రమంలో ఈ ఏడాది చేపట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో రాష్ట్రంలోని కోటి ఎకరాలకు నీరందించాలని తలపెట్టింది. తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది..? అన్నవారికి సమాధానంగా గడిచిన రెండేళ్లలో అనేక కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కడంతోపాటు పాత ప్రాజెక్టులు పరుగందుకున్నాయి. పదేళ్లుగా పరిష్కారానికి నోచని భూసేకరణ, ఇతర సమస్యలు దాదాపు కొలిక్కి వచ్చాయి. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన రాష్ట్ర సర్కారు, సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచూపునకు గురైన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల పూర్తిపై దృష్టిసారించింది. లోయర్‌ పెన్‌గంగ, బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు, సమావేశాలు నిర్వహించి ఒక అవగాహనకు వచ్చింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్టాల్ర సరిహద్దుల్లో లోయర్‌పెన్‌గంగ తోపాటు మూడు బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. అలాగే పాలమూరులో ఆర్డీఎస్‌ కోసం కర్నాటకతో అవగాహన కుదుర్చుకుంది. ఇలా సమస్యలు రాకుండా సాగుతున్న తీరు భవిష్యత్‌ దార్శనికతకు నిదర్శనంగా చూడాలి. సమైక్య పాలనలో జీవం కోల్పోయిన చెరువులకు, మిషన్‌ కాకతీయతో ప్రాణం పోస్తున్నారు. అధికారంలోకి రాగానే విద్యుత్‌ కోతలు లేకుండా ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణలో ప్రైవేటు రంగంలో విద్యుత్‌ ఉత్పత్తిని అనుమతించరాదని విధానపరంగా నిర్ణయించారు.  ప్రభుత్వరంగంలో విద్యుత్‌ ఉత్పత్తి జరిగితే అదనపు ఉత్పత్తి ఫలాలు ప్రజలకు దక్కుతాయి. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి సాధించి, విద్యుత్‌ వాడకం పెరిగితే వచ్చే లాభాలు  డిస్టిబ్యూష్రన్‌ కంపెనీలకు, ట్రాన్స్‌కోకు దక్కుతాయి. కంపెనీలు లాభాల్లోకి వస్తే ప్రజలకు విద్యుత్‌ చార్జీలు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇవన్నీ ఆలోచించి చేయడం వల్ల్నే ఇవాళ తెలంగాన బంగారను తెలంగాణవైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు వేసుకున్న పునాదులు భవంతులుగా మరి నిలవడానికి మరెంతో దూరం లేదు. రౌతుకొద్దీ గుర్రంఅన్న సామెతగా సమర్థ నాయకుడికి రాజ్యం అప్పగిస్తే అభివృద్ది ఎలా సాగుతుందో సిఎంగా కెసిఆర్‌ చేసి చూపుతున్న తీరు భవిష్యత్‌ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది.