నిజాం కర్మాగారంపై స్పందించాలి

ఎవరు అధికారంలోకి వచ్చినా తెరిపించాలి
నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఎవురు గెలిచినా ముందు నిజామాబాద్‌ సహకార చక్కెర కర్మాగారంను పునరుద్దరించడంపై దృష్టి సారించాలని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ  పరిరక్షణ కమిటీ నేతలు కోరారు. గతంలో సిఎం కెసిఆర్‌ హావిూ ఇచ్చినా రైతుల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నారు. ఒకవేళ కెసిఆర్‌ మళ్లీ అధికారం చేపడితే ముందుగా ఈ సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.  దాదాపు 25 వేల మంది రైతులకు, వందలాదిమంది కార్మికులకు కల్పతరువుగా నిలిచిన కర్మాగారాన్ని వెంటనే పునఃప్రారంభించాలన్నారు. గత పాలకుల తప్పిదాలు, ప్రభుత్వాల సహాయ నిరాకరణతో నష్టాల్లో కూరుకుపోయి మూతపడడం దురదృష్టకరమన్నారు. ఇది తెలంగాణకు గౌరవ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వారు  కేంద్రంతో మాట్లాడి దీనిని పునరుద్దరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ఎందరో రైతుల, కార్మికుల బతుకుల దీనితో ముడిపడి ఉన్నాయని అన్నారు. ఎన్సీఎస్సెఫ్‌ కర్మాగారం పరిధిలోని రైతులు చెరుకుపంటను సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కార్మికులు సైతం కష్టపడి పనిచేయడానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి కర్మాగారాన్ని పునఃప్రారంభించ డానికి చర్యలు తీసుకోవాలని సాయిరెడ్డి ఇందూరు వైభవానికి సాక్షిగా నిలిచిందని అన్నారు. నిజామాబాద్‌ మండలం సారంగాపూర్‌ గ్రామంలోని ఎన్సీఎస్సెఫ్‌ కర్మాగారం రైతుల, కార్మికులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిందన్నారు.  వారి అభ్యున్నతిలో కీలకపాత్ర పోషించిందన్నారు. జిల్లాలో ఉన్న రెండు సహకార చక్కెర కర్మాగారాలు మూతపడడంతో ప్రైవేటు కర్మాగారాలు లబ్ధిపొందుతున్నాయన్నారు. కార్మికులకు అందించిన వీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  తెలంగాణప్రభుత్వం దీనిపై ఇదివరకే ప్రకటన చేసిందని, దీనిని పునరుద్దరిస్తారన్నాశతో ఉన్నామని అన్నారు.