ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా కరీనా..

స్పిరిట్‌ చిత్రం కోసం ఎంపికచేసినట్లు వార్తలు
ప్రభాస్‌ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే షూటింగ్‌ కాస్త లేటైనా పర్లేదు కాని అవుట్‌ పుట్‌
మాత్రం బాగుండాలి అని దర్శకులకు చెప్తున్నాడట. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ’ఆదిపురుష్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకోగా.. ’సలార్‌’, ’ప్రాజెక్ట్‌`ఐ’ షూటింగ్‌ దశలో ఉన్నాయి. వీటి తర్వాత ప్రభాస్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ’స్పిరిట్‌’ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రభాస్‌కు ఇది 25వ సినిమా కావడం విశేషం. ప్రభాస్‌ కోసం సందీప్‌ ఒక పవర్‌ ఫుల్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశాడట.
ప్రస్తుతం సందీప్‌, రణ్‌బీర్‌తో ’యానిమల్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత స్పిరిట్‌ మొదలు కానుంది. ఇప్పటికే సందీప్‌ స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేశాడని సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ను ఎంపిక చేసే పనిలో సందీప్‌ ఉన్నాడట. ఇప్పటికే కరీనాతో చర్చలు జరుపగా.. త్వరలోనే తన నిర్ణయం చెప్తానని తెలిపినట్లు టాక్‌. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం విభిన్న భావాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రభాస్‌కు కరీనా సెట్‌ కాదని, వీరిద్దరూ స్క్రీన్‌పై కనిపిస్తే అక్కా, తమ్ముడు లాగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా సందీప్‌ను ట్యాగ్‌ చేస్తూ ప్రభాస్‌కు వేరే హీరోయిన్‌ను చూడమని.. ఆయన క్రేజ్‌కు తగ్గ హీరోయిన్‌ను ఎంపిక చేయమని అభిమానులు కోరుతున్నారు.