మంత్రి ఈటెల కారు బోల్తా

C

– ఈటెలకు స్వల్ప గాయాలు

-అపాయం లేదన్న వైద్యులు

-హైదరాబాద్‌ యశోదా ఆసుపత్రికి తరలింపు

కరీంనగర్‌,13 జూన్‌ (జనంసాక్షి)

కారు ప్రమాదంలో మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాప పడడంతో గాయాలతో బయటపడ్డారు.  కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం ఈదులగుట్టపల్లి వద్ద శనివారం సాయంత్రం  కారు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కారులోనే ఉన్నారు. హుటాహుటిన ఆయనను కరీంనగర్‌ అపోలోకు తరలించారు. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా ఈదులగుట్టపల్లి వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. కరీంనగర్‌కు 12 కిలోవిూటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మంత్రిని 108 వాహనంలో హుటాహుటిన కరీంనగర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కాలు విరిగినట్లుగా వైద్యులు అనుమానిస్తున్నారు.ఈ ప్రమాదంలో మంత్రితో పాటు ఆయన పీఏ ముకుందర్‌రెడ్డి, గన్‌మెన్‌, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కావడంతోఐదుసార్లు పల్టీలు కొట్టినప్పటికీ మంత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంత్రికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ప్రమాదవార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ నీతూప్రసాద్‌, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ అపోలో ఆస్పత్రికి చేరుకుని మంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కారు బోల్తా పడి, ప్రమాదంలో గాయపడిన మంత్రి ఈటల రాజేందర్‌తో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీసారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.సీఎం కేసీఆర్‌ సూచన మేరకు మంత్రితో సహ క్షతగాత్రులను హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు.  ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న కేసీఆర్‌.. మంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  కాగా, మంత్రి రాజేందర్‌కు తగిలినవి స్వల్ప గాయాలేనని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ బోయినపల్లి వినోద్‌ తెలిపారు.

కారు కండిషన్‌పై అనుమానాలు

ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ఉపయోగిస్తున్న వాహనం కండిషన్‌ విూద అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థికమంత్రి ఉపయోగించే వాహనానికి ఉన్న నాలుగు టైర్లూ బాగా అరిగిపోయినా వాటిని మార్చకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొట్టిన వాహనం వెనకవైపు టైరు బరస్ట్‌ అయినట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. ముందు టైర్లు, వెనక టైర్లు కూడా బాగా అరిగిపోయాయి.

ఇదే వాహనం ఇంతకుముందు నెలరోజుల క్రితం ఒకసారి ప్రమాదానికి గురైంది. అప్పట్లో తాడిచెట్టును ఢీకొన్న ఈ వాహనం బాగా ధ్వంసమైంది. తర్వాత దానికి మరమ్మతులు చేయించారు. కనీసం ఆ సమయంలోనైనా వాహనం టైర్ల గురించి పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సుదూర పర్యటనలకు సైతం ఉపయోగించే అధికారిక వాహనం టైర్లు అరిగిపోయినా.. వాటిని మార్చాల్సిన సమయం మించిపోయినా పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే అది అదుపుతప్పి బోల్తాపడిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.