మధిర నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర

ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం
ఖమ్మం,ఫిబ్రవరి24(జనం సాక్షి): ప్రజాసమస్యల పరిష్కారం కోరతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
. సుమారు 500కి.విూపైగా నిరంతరం సాగే ఈ పాదయాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలు, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, క్షేత్రస్థాయిలో అమలుతీరున ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం తీరు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, అర్హులకు పింఛన్లు ఇలా టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హావిూలు అమలుతీరును ప్రజలనుంచే అడిగి తెలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మార్చి 30వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. 27న ఉదయం 9గంటలకు ముదిగొండ మండలం యడవల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తెలిపారు. భట్టి పాదయాత్ర ప్రారంభానికి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముదిగొండ, చింతకాని, బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భట్టిపాదయాత్ర నిర్వహించనున్నారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం పాదయాత్రను ముగించనున్నారుఈ పాదయాత్ర కార్యక్రమంలో ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందించాలని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు విజ్ఞప్తిచేశారు.