గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు… జీజీహెచ్ లో ప్రత్యేక ఓపీ ఏర్పాటు
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు నగర పరిధిలో రెండు కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి నిన్న వెల్లడించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు తెనాలి, ఉండవల్లి వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొవిడ్ కేసులు ఇప్పుడు గుంటూరు నగరంలోకి కూడా విస్తరించడం గమనార్హం. కొవిడ్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జీజీహెచ్ క్యాజువాలిటీ విభాగం సమీపంలో ప్రత్యేకంగా అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఓపీ విభాగంలో రోజుకు కనీసం వంద మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బీ క్లాస్ వార్డులో 15 పడకలతో ఈ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామని, ఇందులో వెంటిలేటర్లతో పాటు నిరంతర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచామని డాక్టర్ విజయలక్ష్మి వివరించారు. ప్రజలు కొవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.