నాలుగు కోట్ల మంది ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటిరి పోరాటం చేశారని, ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను మహాత్ముడి స్ఫూర్తితో కేసీఆర్ నెరవేర్చారని కొనియాడారు.2023 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, తెలంగాణ ప్రజల పట్ల తమ ప్రేమ ఏమాత్రం తగ్గలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఖండాలు దాటిన తెలంగాణ బిడ్డల నైపుణ్యాన్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తోందని, అమెరికాలోని తెలంగాణ వాసులను చూసి తెలంగాణ తల్లి పులకించిపోతోందని కేటీఆర్ అన్నారు. పుట్టిన గడ్డకు వేల మైళ్ల దూరంలో ఉన్నా తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మను మర్చిపోకపోవడం అభినందనీయమన్నారు. 2014 జూన్ 2న అసాధ్యం సుసాధ్యమైన రోజని, దశాబ్దాల కలలు ఫలించిన రోజని ఆయన అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేశామని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో వ్యవసాయానికి పెద్దపీట వేశామని కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.