ఆర్సీబీ ఆల్ ది బెస్ట్.. ఈసారి కప్ మనదే: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
మరికొన్ని గంటల్లో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది సమరానికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. తుది పోరులో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక, ఇవాళ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ఆర్సీబీకి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈసారి కప్ బెంగళూరుదేనని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. 18 ఏళ్ల పోరాటంలో ప్రతి ప్రార్థన, ఎంకరేజ్మెంట్, బాధ ఈ రోజు కోసమే అంటూ ఆయన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. “ఈసారి కప్ మనదే! 18 సంవత్సరాల పోరాటం. కర్ణాటక ప్రజలంతా మీతోనే ఉన్నారు” అని చెబుతూ డీకే శివకుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… ఆర్సీబీ ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఈసారి తప్పకుండా ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.