ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ..!

రాజోలి, జూన్‌ 03 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు మళ్లీ మొదలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చారు. దీంతో పలు గ్రామాల రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఒక్కొక్కరుగా కదిలొస్తూ ఫ్యాక్టరీ వ్యతిరేక నినాదాలు చేయడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోరాట కమిటీ సైతం ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం ప్రజల తరపున ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అర్థరాత్రి, తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా దొంగల్లాగా ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం కంటైనర్లు, టిప్పర్లు, హిటాచీలను ప్రైవేటు సైన్యంతో పెద్దధన్వాడలోని నిర్మాణ స్థలంలోకి తీసుకొచ్చారు. గత ఆరునెలలుగా 12 గ్రామాల ప్రజలైన మేము క్యాన్సర్‌ కారకాలు, విషాన్ని పెట్టే ఫ్యాక్టరీని నిర్మించవద్దని పలు రకాల నిరసన నిరహార దీక్షలు కొనసాగించాము. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ అలంపూర్‌ నియోజకవర్గ ఇంచార్జి సంపత్‌ కుమార్‌ హామీతో మేము ఆయనను నమ్మి దీక్షలు విరమించాం. ఫ్యాక్టరీ పనులు బంద్‌ చేయించే బాధ్యత తనదేనని భరోసా ఇవ్వడంతో మేమంతా నమ్మినాము. అర్థరాత్రి ప్రజలు గాఢ నిద్రలో ఉండగా.. ఇలాంటి దొంగ దెబ్బ తీస్తారని ఊహించలేదు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి, శాంతియుత పద్దతుల్లో పోరాడుతున్న సమయంలో గ్రామ ప్రజలపై దాడి చేసేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దురుద్దేశంతో ప్రైవేటు సైన్యంతో మోహరించడం ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం కోరుకుంటున్నట్టు..? ప్రజల సహనాన్ని పరీక్షించడం దీనికి సంకేతం..? ఇది మరో దిలావార్‌ పూర్‌, లగచర్ల కావాలని ఫ్యాక్టరీ యాజమాన్యం కుట్ర చేస్తోంది. శాంతియుత పద్దతుల్లో ఆందోళన చేస్తున్న ప్రజలపైకి మందిమార్భలం, గుండాలతో రావడం అంటే ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్ర కూడా ఇందులో దాగి ఉన్నట్టు అర్థమవుతోంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌ వెంటనే స్పందించి ఈ కుట్రను భగ్నం చేయాలని కోరుతున్నాం. ఇంతమంది గూండాలను మా గ్రామంపైకి ప్రయోగించినా.. ఉద్యమం ఆగదని, ఫ్యాక్టరీ ఇక్కడినుంచి వెళ్ళిపోయే వరకు వెనక్కి తగ్గేదే లేదని సమిష్టిగా తెలియజేస్తున్నాం. తీసుకొచ్చిన యంత్రాలు, కంటైనర్లను తిరిగి వెనక్కి పంపాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఓట్లు అడగడానికి వచ్చే ప్రతి నాయకుడు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, బుద్ధిజీవులు మా న్యాయమైన పోరాటానికి అండగా నిలవాలని కోరుతున్నాం..!’