మన ప్రాజెక్టులు మీ ఆంధ్రోళ్లు కట్టొద్దంటున్నరు
– ఎర్రబెల్లి, ఎల్.రమణ మీ వైఖరేంటి?
– మంత్రి హరీష్
హైదరాబాద్ జూన్ 14 (జనంసాక్షి):
ఎవరెన్ని కుట్రలు చేసినా పాలమూరు ఎతిపోతల,డిండి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తమని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై టీడీపీ నేతలు, ఎర్రబెల్లి, రమణ సమాధానం చెప్పాలని సూచించారు. ప్రాజెక్టులు నిర్మించాలా.. వద్దా.. ఎర్రబెల్లి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని చూపి ఓర్వలేకే కాంగ్రెస్, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నరని మండిపడ్డారు. మిషన్కాకతీయకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. మిషన్కాకతీయ పనుల పారదర్శకంగా జరుగుతున్నయని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులెదురైనా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుల అంశంలో చంద్రబాబు కుట్రలను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి దేవినేని ఉమా కేంద్రానికి రాసిన లేఖను తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, ఎల్.రమణలు సమర్ధిస్తారా? విమర్శిస్తారా అని ప్రశ్నించారు. ఉద్యమంలా సాగుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంటే… ప్రతిపక్ష నాయకులు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.