మాజీ మంత్రి సరోజిని పుల్లారెడ్డి ఇకలేరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (పిఇఎంఎస్‌):
మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు సరోజనీ పుల్లారెడ్డి ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన సరోజని పుల్లారెడ్డి.. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో మునిసిపల్‌ శాఖతో పాటు పలు శాఖలను నిర్వహించారు. ఆమె హైదరాబాద్‌ నగర తొలి మేయర్‌గా పనిచేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె పార్దీవదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షు రాలు విజయమ్మ, మాజీమంత్రి సమరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యురాలిగా కూడా సరోజని పుల్లారెడ్డి పనిచేశారు. ఆమె మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.